Attack: ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం మూలగుంటపాడు గ్రామ పరిధిలోని వెంకటేశ్వర నగర్ దళిత కాలనీ వాసులపై.. శుక్రవారం కొంతమంది యువకులు కర్రలు, ఆయుధాలతో దాడిచేశారు. ఈ ఘటనలో 13 మంది గాయపడ్డారు. నాలుగు రోజుల క్రితం ఈ కాలనీలో వివాహ కార్యక్రమం సందర్భంగా ముగ్గురు యువకులు రహదారి వెంబడి కూర్చుని ఉండగా మువ్వా రామిరెడ్డి కుమారుడు సాయిరెడ్డి తన ద్విచక్ర వాహనంతో చక్కర్లు కొట్టారు. ఈ క్రమంలో సాయిరెడ్డికి, యువకులకీ మధ్య వాగ్వాదం చోటు చేసుకోగా స్థానికులు సర్ది చెప్పి పంపించి వేశారు.
గురువారం రాత్రి పాత సింగరాయకొండ తిరునాళ్లలో కాలనీ యువకులు.. సాయిరెడ్డి, అతని సహచర బృందం గొడవపడి మద్యం సీసాలతో దాడి చేసుకున్నారు. పోలీసుల జోక్యంతో వివాదం సద్దుమణిగింది. అయితే శుక్రవారం తెల్లవారుజామున సాయిరెడ్డి బృందం ఇనుపరాడ్లు, కర్రలు, కత్తితో దళిత కాలనీలోకి ప్రవేశించి.. కనిపించిన మహిళలు, యువకులపై దాడిచేసి తీవ్రంగా గాయపరిచారు. ఈ దాడిలో పవన్కుమార్, సుబ్బారావు, రాంప్రసాద్ల తల, శరీరాలపై తీవ్ర గాయాలయ్యాయి. మరో పదిమంది గాయపడ్డారు.
ఆగ్రహించిన కాలనీవాసులు తమపై దాడికి పాల్పడ్డవారి నివాసంపైకి దూసుకొచ్చారు. అక్కడికి పోలీసులు చేరుకోవడంతో రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. వారిని చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీఛార్జి చేశారు. దాడులు చేసిన వారిని విడిచిపెట్టి తమపై లాఠీఛార్జి చేయడమేమిటని పోలీసులతో వారంతా వాగ్వాదానికి దిగారు. సీఐ లక్ష్మణ్ చర్చలు జరిపి నిందితులను శిక్షిస్తామని హామీ ఇవ్వడంతో నిరసన విరమించారు. అనంతరం దాడికి పాల్పడ్డ 10 మందిని పోలీసులు అదుపులోకి తీసుకొని స్టేషన్కు తరలించారు.
అధికార పార్టీ అండతోనే దాడి: ఎమ్మెల్యే స్వామి
కొండపి శాసనసభ్యుడు డోలా బాలవీరాంజనేయస్వామి బాధితులను పరామర్శించారు. నిందితులు అధికార పార్టీ నాయకుల అండతో దళిత కాలనీవాసులపై దాడి చేశారని ఆరోపించారు. ఎస్సైపై చర్యలు తీసుకోవాలని, నిందితులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాలని డిమాండ్ చేశారు. నియోజకవర్గ వైకాపా ఇన్ఛార్జి వరికూటి అశోక్బాబు బాధితులతో మాట్లాడారు.
ఇవీ చూడండి: