STEMI PROJECT: గుండెపోటు వచ్చిన వారికి తొలిగంటలోనే ప్రాథమిక చికిత్స అందించే చర్యల్లో భాగంగా ఈ నెలాఖరులోగా చెన్నైకి చెందిన స్టెమీ ఇండియా సంస్థతో ఒప్పందాన్ని కుదుర్చుకోబోతున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఈ మేరకు విశాఖపట్నం, కాకినాడ, విజయవాడ, గుంటూరు, తిరుపతి, కర్నూలు, అనంతపురం ఆస్పత్రులు హబ్ సెంటర్లుగా అభివృద్ధి చేయనున్నట్లు ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు తెలిపారు. తొలి దశలో కర్నూలు, కాకినాడలో క్యాథ్ల్యాబ్స్ ఏర్పాటుకు రూ.120 కోట్లు ఖర్చు చేయబోతున్నామన్నారు.
దీంతోపాటు స్పోక్ సెంటర్లుగా అభివృద్ధి చేసే ఆసుపత్రుల కోసం ఈసీజీ యంత్రాలు, థ్రాంబోలిసిస్ కోసం ఉపయోగించే ఇంజెక్షన్లను కొనుగోలు చేస్తున్నామన్నారు. బహిరంగ మార్కెట్లో రూ.30 వేలు ఖరీదు చేసే ఈ ఇంజెక్షన్ను రూ.20 వేలకు తీసుకుంటున్నామని, ఈ ఇంజెక్షన్ ద్వారా గుండెలోని బ్లాక్ కరిగి ప్రాణాపాయ పరిస్థితి నుంచి రోగులు బయటపడతారని కృష్ణబాబు అన్నారు. ఆ తరువాత క్యాథ్ల్యాబ్ ఉన్న ఆసుపత్రికి తరలిస్తే.. అవసరాన్ని బట్టి శస్త్రచికిత్సలు చేస్తారు.
ఏరియా, జిల్లా ఆసుపత్రుల్లో పనిచేసే వైద్యులు, స్టాఫ్ నర్సులు, పారా మెడికల్ సిబ్బందికి శిక్షణ నివ్వనున్నారు. గుండె సంబంధిత సమస్యలతో బాధపడే వారికి ఈసీజీ పరీక్షలు నిర్వహించి, నివేదికలను డిజిటల్ విధానంలో హబ్ సెంటర్లలో ఉన్న వైద్య నిపుణులకు పంపుతారు. ఇక్కడి నిపుణులు ఇచ్చే సలహాలు అనుసరించి బాధితులకు థ్రాంబోలిసిస్ చికిత్సను అందిస్తారు. ఈ విధానం అమలు తీరును నాలుగైదు నెలల పాటు లోతుగా పరిశీలించనున్నారు.
అనంతరం ఆరోగ్య శ్రీ అనుబంధ ప్రైవేట్ ఆసుపత్రుల సాయంతో రాష్ట్ర వ్యాప్తంగా ఈ సేవలు అందుబాటులోనికి తెస్తామన్నారు. రాష్ట్రంలో 38 లక్షల మందికి పైగా గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. వీరిలో వార్షిక మరణాల సంఖ్య 32% వరకు ఉందన్నారు. ఈ మరణాల నిరోధానికి ఒప్పందం జరగనున్న చెన్నైలోని స్టెమీ ఇండియా ఇప్పటికే గుజరాత్, తమిళనాడు, ఝార్ఖండ్ రాష్ట్రాల్లో సేవలు అందిస్తోంది. ఈ చికిత్సా విధానాన్ని ఎస్టీ ఎలివేషన్ మయోకార్డియల్ ఇన్ఫ్రాక్షన్గా వ్యవహరిస్తున్నారు.
"ఇంతకుముందు వైరల్, బాక్టీరియాల వల్ల జబ్బులు వచ్చి ఎక్కువమంది చనిపోవటం మనం చూసేవాళ్లం. అయితే ఇప్పుడు మాత్రం క్యాన్సర్, హార్ట్ ఎటాక్, బీపీ, షుగర్ వంటి నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ వల్ల మన దేశంలో సుమారు 63 శాతం మరణాలు సంభవిస్తున్నాయి. ఇందులో ఎన్సీడీఎస్ వల్ల 68 శాతం మరణాలు మన రాష్ట్రంలో సంభవిస్తున్నాయి. వీటిలో 32 శాతం మంది గుండె సంబంధిత సమస్యలతో మరణిస్తున్నారు. అందువల్ల గుండెపోటు వచ్చిన వారికి మొదటి గంటలోనే ప్రాథమిక చికిత్స అందించే చర్యల్లో భాగంగా ఈ నెలాఖరులోగా చెన్నైకి చెందిన స్టెమీ ఇండియా సంస్థతో ఒప్పందాన్ని కూర్చుకోనున్నాము." - కృష్ణబాబు, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి
ఇవీ చదవండి: