ప్రభుత్వ శారదా సంగీత కళాశాల
‘పులకించని మది పులకించు.. వినిపించని కథ వినిపించు..’ అంటూ మనలో సంగీతం చేసే మాయాజాలం గురించి అందంగా వర్ణించారో కవి. మనలో భావాలను వ్యక్తపరిచేందుకు, మనస్సును ఉత్తేజపరిచేందుకు సంగీతం పరిపరివిధాలా దోహదపడుతుంది. ప్రస్తుతం జిల్లావ్యాప్తంగా అనేక శాస్త్రీయ, సినీ సంగీతం పట్ల ఆదరణ అభిమానులు చూపుతున్నారు. యువత అటు సినీ సంగీతంపై ఎక్కువ చూపుతూనే శాస్త్రీయ సంగీతాన్నీ ఇష్టపడుతున్నారు. నేడు సంగీత దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం.
రాయలసీమ జిల్లాలకు ప్రభుత్వ సంగీత కళాశాల ఒకటే ఉంది. అది కర్నూలు పాతనగరంలోని ప్రభుత్వ శారదా సంగీత, నృత్య కళాశాల. దీన్ని 1973లో ప్రారంభించారు. నాటి నుంచి నేటి వరకు ఎంతో మంది అక్కడ ఎంతో శాస్త్రీయ సంగీతాన్ని నేర్చుకుంటున్నారు. ప్రస్తుతం కరోనా కారణంగా ఈ ఏడాది ప్రవేశాలు జరగలేదు. ప్రతి ఏడాది 250 మంది వరకు కళాశాలలో శాస్త్రీయ సంగీతాన్ని నేర్చుకోవడానికి వస్తున్నారు. గాత్రం, వీణ, వయోలిన్, మృదంగం, నాదస్వరం ఈ కళాశాలలో నేర్పిస్తారు. 11 నుంచి 50 ఏళ్లలోపు ఉన్న వారు కళాశాలలో చేరవచ్ఛు మొదటి ధ్రువపత్రం తీసుకోవడానికి నాలుగేళ్లు పడుతుంది. ఆ తర్వాత డిప్లొమాకు రెండేళ్లు పడుతుంది. జిల్లా వ్యాప్తంగా పలు ప్రైవేటు పాఠశాలల్లో శాస్త్రీయ సంగీతాన్ని నేర్పిస్తున్నారు. వీటితో పాటు ప్రైవేటు సంస్థలు కూడా శాస్త్రీయ సంగీతాన్ని విద్యార్థులకు చెబుతున్నారు. సుమారు 20 ప్రైవేటు సంస్థలు శ్రాస్తీయ సంగీతాన్ని నేర్పిస్తుండగా, 30 సంస్థలు కీబోర్డు, గిటార్, డ్రమ్స్ మొదలైనవి నేర్పిస్తున్నాయి.
ఆదరణ తగ్గలేదు
- డా.గోపవరం రామచంద్రన్, ప్రభుత్వ శారదా సంగీత, నృత్య కళాశాల ప్రిన్సిపల్
శాస్త్రీయ సంగీతానికి నేటికి ఆదరణ తగ్గలేదు. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు సంగీతాన్ని నేర్చుకుంటున్నారు. ఈ సంగీతం నేర్చుకున్న వాళ్లకి ఉపాధి, ఉద్యోగవకాశాలు వస్తుండటంతో మరింత ఆదరణ పెరిగింది. యువత సైతం మరింతగా ముందుకు రావాలి. వారిని పెద్దలు ప్రోత్సహించాలి.
పాటతోనే గుర్తింపు - సుధారాణి, గాయని
పాటల ద్వారానే నాకు ఎంతో గుర్తింపు వచ్చింది. 35 ఏళ్లుగా పాటలు పాడుతునే ఉన్నాను. 1990లో శాస్త్రీయ సంగీతం నేర్చుకున్నా. సినిమాలు పాటలు పాడాలంటే పునాది చాలా అవసరం. అటువంటి పునాదే శాస్త్రీయ సంగీతం. నేటి యువత సంగీత ప్రపంచంలో రాణించేందుకు పోటీ పడుతున్నారు.