శ్రీశైలం జలాశయం(srisailam reservoir)లో వరద ప్రవాహం తగ్గుతోంది. రిజర్వాయర్ గరిష్ఠ నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 811.70 అడుగులుగా ఉంది. డ్యాము గరిష్ఠ నీటి నిల్వ 215.807 టీఎంసీలు కాగా.. ప్రస్తుత నీటినిల్వ 35.2772 టీఎంసీలుగా ఉంది. ఎడమ జల విద్యుత్ కేంద్రంలో విద్యుదుత్పత్తి కొనసాగుతోంది. విద్యుదుత్పత్తి చేయగా.. మిగిలిన 6,357 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
ముంపు ప్రాంతాల్లోకి వరదనీరు
గుంటూరు జిల్లా పులిచింతల ప్రాజెక్టులో నీటి మట్టం పెరుగుతుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. జలాశయం పూర్తి సామర్థ్యం 45.77 టీఎంసీలు కాగా... ప్రస్తుతం నీటి నిల్వలు 40 టీఎంసీలు దాటాయి. నాగార్జున సాగర్లో విద్యుత్ ఉత్పత్తి ద్వారా పులిచింతలకు 36 వేల క్యూసెక్కుల నీటి ప్రవాహం వస్తోంది. ఇప్పటికే ముంపు ప్రాంతాల్లోకి వరదనీరు చేరింది. నీటి నిల్వ 42 టీఎంసీలకు చేరగానే గేట్లు ఎత్తేందుకు పులిచింతల అధికారుల సన్నాహాలు చేస్తున్నారు. అందుకే ప్రాజెక్టు దిగువన లోతట్టు ప్రాంతాల వారు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. అలాగే కృష్ణా, గుంటూరు జిల్లాలతో పాటు తెలంగాణ సూర్యాపేట జిల్లా అధికారులకు లేఖ రాశారు. ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు. ఇక పులిచింతల ప్రాజెక్టులోనూ.. తెలంగాణ జెన్కో విదుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. 50మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నట్లు పులిచింతల అధికారులు తెలిపారు. తద్వారా 9వేల900 క్యూసెక్కుల నీరు దిగువకు వెళ్తోంది.