ప్రభుత్వ విప్, జగ్గయ్యపేట వైకాపా ఎమ్మెల్యే సామినేని ఉదయభానుపై క్రిమినల్ కేసులు ఎత్తివేస్తూ... రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. సామినేని ఉదయభాను నిందితుడిగా ఉన్న పది క్రిమినల్ కేసుల్ని ఎత్తేస్తూ రాష్ట్ర హోంశాఖ ఆదేశాలిచ్చింది. డీజీపీ నుంచి అందిన ప్రతిపాదనల మేరకు కేసులు ఎత్తివేస్తున్నట్లు ఉత్తర్వుల్లో ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు రాష్ట్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్ ఆదేశాలు జారీ చేశారు. ఉదయభానుపై నమోదైన 10 క్రిమినల్ కేసులపై ప్రస్తుతం విజయవాడలోని ప్రజాప్రతినిధుల ప్రత్యేక న్యాయస్థానంలో విచారణ కొనసాగుతోంది. ఈ ప్రక్రియ కొనసాగుతుండగానే ఆ పది కేసుల్లో విచారణను ఉపసంహరించుకుంటూ ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. పబ్లిక్ ప్రాసిక్యూటర్తో న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేయించాలని డీజీపీని హోంశాఖ ఆదేశించింది. ఉదయభానుపై వివిధ నేరారోపణలకు సంబంధించి 2015-2019 మధ్య క్రిమినల్ కేసులు నమోదుకాగా... కృష్ణా జిల్లాలోని నందిగామ, జగ్గయ్యపేట, చిల్లకూరు, వత్సవాయి పోలీసుస్టేషన్ల పరిధిలో కేసులున్నాయి.
ఇదీ చదవండి: