![tdp mla anagani satyaprasad open letter to cm jagan](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/6052890_letter.png)
వైకాపా అధికారంలోకి వచ్చాక పలువురు అధికారులను వీఆర్లో పెట్టి అష్టకష్టాలు పెడుతున్నారని గుంటూరు జిల్లా రేపల్లె తెదేపా ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ ముఖ్యమంత్రి జగన్కు రాసిన బహిరంగ లేఖలో ఆరోపించారు. పోస్టింగులు కూడా ఇవ్వకుండా నెలల తరబడి నిరీక్షణలో ఉంచుతున్నారని విమర్శించారు. వేతనాలు కూడా చెల్లించేది లేదని జీవో తీసుకొచ్చి వేధనకు గురి చేస్తున్నారని పేర్కొన్నారు. పోలీసుల విధుల్లో, బాధ్యతల్లోనూ రాజకీయ జోక్యం పెరిగిపోయిందని మండిపడ్డారు. ప్రజల కోసం పాటు పడితే వేటు పడుతుందేమో అనేంతలా భయపడే పరిస్థితి కల్పించారని దుయ్యబట్టారు. నిన్నటి వరకు ప్రతిపక్ష నాయకులు, కార్యకర్తల ప్రాణాల తీసిన వైకాపా ఫ్యాక్షన్ కత్తిని.. నేడు ప్రభుత్వ ఉద్యోగులపైనా ప్రయోగించడం దారుణమని ధ్వజమెత్తారు. గతంలో ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానాలతో జనంతో మమేకమైన పోలీసుల్ని... నేడు జనం భయపడే పరిస్థితికి తీసుకొచ్చారన్నారు.
ఎల్వీపై అందుకే వేటు
58 మంది డీఎస్పీలు, 100 మంది వరకూ ఇన్స్పెక్టర్లు, 10 మంది అదనపు ఎస్పీలను నెలల తరబడి నిరీక్షణలో ఉంచడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. 3 నెలలకు మించి వెయిటింగ్లో ఉంటే జీతాలివ్వరా అని నిలదీశారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు ఉద్యోగులు బలవుతున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వ నియంత విధానాలను కాదని ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించిన ఎల్వీ సుబ్రహ్మణ్యంపై వేటు వేశారని... 30 సంవత్సరాల అనుభవం కలిగిన ఐపీఎస్ అధికారిపై దేశద్రోహం ముద్ర వేస్తున్నారని మండిపడ్డారు. వైకాపా అధికారంలోకి వచ్చింది ప్రజలు, ఉద్యోగుల్ని అవస్థలకు గురి చేయడానికేనా అని లేఖలో పేర్కొన్నారు.
ఇదీ చదవండి: