ఉల్లి కోసం ప్రజలు పడుతున్న పాట్లు అన్నీఇన్నీ కావు. బహిరంగ మార్కెట్లో కిలో ఉల్లి 80 నుంచి 100 రూపాయలు పలకుతోంది. ప్రజలు బెంబేలెత్తి పోతున్నారు. ప్రభుత్వం మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో రైతు బజార్లలో కిలో 25 రూపాయలకు రాయితీపై విక్రయిస్తోంది. ప్రజలు రైతు బజార్లకు పోటెత్తుతున్నారు. గుంటూరులో ఉదయం, సాయంత్రం వేళల్లో మాత్రమే విక్రయాలు జరుపుతున్నారు. పెద్దఎత్తున వినియోగదారులు రైతు బజార్లకు వస్తున్నారు.
క్యూలైన్లు చాంతాడును తలపిస్తున్నాయి. కిలో ఉల్లి కోసం గంటల తరబడి క్యూలో నిల్చుంటున్నారు. ఉల్లి కోసం తమ వెంట పిల్లల్ని తీసుకురావాల్సిన పరిస్థితి ఏర్పడింది. వృద్ధులూ క్యూలో పడరానిపాట్లు పడుతున్నారు. ఆధార్ లేదా రేషన్ కార్డు ఆధారంగా ఒక్కొక్కరికి ముందుగానే రైతుబజారు నిర్వాహకులు టోకెన్లు ఇస్తున్నారు. ఈ పాట్లు ఎన్నాళ్లో అర్థం కావడం లేదంటున్నారు.