గుంటూరు సర్వజన ఆస్పత్రితో క్యాన్సర్ వైద్య సేవలు సైతం అందుబాటులోకి రానున్నాయి. ఎంతో ఖర్చుతో కూడుకున్న ఈ సేవలు నాట్కోఫార్మా, రాష్ట్రప్రభుత్వం సంయుక్త భాగస్వామ్యంతో పేదల చెంతకు చేరనున్నాయి. 50 కోట్ల రూపాయల వ్యయంతో జీజీహెచ్లో అధునాతన క్యాన్సర్ విభాగం నిర్మించారు. నాట్కో సంస్థ 33 కోట్ల రూపాయలతో భవనాన్ని నిర్మించి ఇవ్వగా.. రాష్ట్ర ప్రభుత్వం అధునాతన పరికరాల కోసం 17 కోట్లు కేటాయించింది. రాష్ట్రంలో ఏ ప్రభుత్వాసుపత్రిలో లేని విధంగా 100 పడకలతో సెల్లార్, జీ ప్లస్ 3 అంతస్తుల్లో ఆస్పత్రిని తీర్చిదిద్దారు. ఉమ్మడి రాష్ట్రంలో క్యాన్సర్ వ్యాధికి హైదరాబాద్లోని ఎమ్.ఎన్.జి ఆస్పత్రి రిఫరల్ ఆస్పత్రిగా ఉండేది. రాష్ట్ర విభజన అనంతరం క్యాన్సర్ రోగులకు అధునాతన సదుపాయాలతో ఆస్పత్రి లేకపోవడం ఇబ్బందిగా మారింది. ఇప్పుడు గుంటూరు సర్వజన ఆస్పత్రిలో అత్యాధునిక వైద్యసేవలు అందుబాటులోకి రానున్నాయి.
అత్యాధునిక వ్యాధి నిర్ధరణ యంత్రాలు..
కార్పొరేట్ ఆస్పత్రులకే పరిమితమైన కొన్ని అత్యాధునిక క్యాన్సర్ నిర్ధరణ పరీక్షలు సైతం జీజీహెచ్ లో చేయనున్నారు. బ్రాకీ థెరపీ, డిజిటల్ మామోగ్రామ్, ఆపరేటింగ్ మైక్రో స్కోప్, పెట్ స్కాన్ వంటి అత్యాధునిక వ్యాధి నిర్ధరణ యంత్రాలను ప్రభుత్వం సమకూర్చనుంది. రేడియేషన్ థెరపీకి అవసరమైన అంత్యంత ఆధునిక యంత్రం లీనియర్ యాక్సిలేటర్ను సైతం 13 కోట్ల రూపాయలు వెచ్చించి స్విట్జర్లాండ్ నుంచి తెప్పించారు. అత్యాధునిక సదుపాయాలతో క్యాన్సర్ ఆస్పత్రి నిర్మాణంతో రేడియేషన్ అంకాలజీ వంటి పీజీ కోర్సులతోపాటు మెడికల్, సర్జికల్ అంకాలజీ విభాగాలను ప్రారంభించడానికి కేంద్రం నుంచి అనుమతి వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు.
జులై 1 ముఖ్యమంత్రి జగన్ క్యాన్సర్ వైద్య సేవలను లాంఛనంగా ప్రారంభించనుండగా.. అదే రోజు ఆస్పత్రి భవనాన్ని నాట్కో ఫార్మా సంస్థ సీఎండీ నన్నపనేని వెంకన్న చౌదరి జీజీహెచ్కు అప్పగించనున్నారు.