గుంటూరు జిల్లా తాడేపల్లిలోని మణిపాల్ ఆస్పత్రి వైద్యుల నిర్లక్ష్యం వల్లే తన భర్త ప్రాణాలు కోల్పోయారంటూ విజయవాడకు చెందిన పావని కుమారి అనే మహిళ ఆరోపించింది. డిసెంబరు 7న మెడ నొప్పితో మణిపాల్ ఆస్పత్రికి వెళితే నరాల నిపుణులు రవికాంత్ రూ. 3 లక్షలు కట్టించుకొని సర్జరీ చేశారని.. అయినా ప్రాణాలు దక్కలేదంటూ పావని వాపోయింది. సర్జరీ చేసిన తరువాత కూడా చికిత్స పేరుతో వేల రూపాయల బిల్లులు వసూలు చేశారని తెలిపింది. గతంలో ఇదే ఆస్పత్రిలో తన కుమారుడికి కాన్సర్కు రూ. 30 లక్షలు ఖర్చు చేశామన్నారు. అలాగే భర్తకు సైతం చికిత్స అందించి కాపాడతారని లక్షలు వెచ్చించామని ఆమె వెల్లడించారు.
తన భర్త వెంకటశివకుమార్ మరణానికి పది రోజుల ముందు ఆస్పత్రిలో సక్రమంగా వైద్యం అందడం లేదని తాడేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశామని.. దీనిపై విచారణ జరుగుతుండగానే శనివారం రాత్రి ప్రాణాలు కోల్పోయారని మృతుడి భార్య ఆవేదన వ్యక్తం చేసింది. దీనిపై స్పందించిన ఆస్పత్రి వైద్యులు శివకుమార్ కు అరుదైన వ్యాధి రావడంతో ప్రాణాలు కోల్పోయారని స్పష్టం చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు పూర్తి వివరాలను వైద్య మండలికి పంపుతామని.. అక్కడి నుంచి నివేదిక వచ్చిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు.
ఇదీ చదవండి: హైదరాబాద్ అపోలో ఆస్పత్రి నుంచి రజినీకాంత్ డిశ్చార్జ్