High Court on Kapu Reservation: ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు కేటాయించిన 10% కోటాలో కాపులకు 5% రిజర్వేషన్ను అమలు చేసేలా ఆదేశాలివ్వాలంటూ కాపు సంక్షేమ సేన వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ మంత్రి హరిరామజోగయ్య దాఖలు చేసిన వ్యాజ్యానికి.. ప్రజాహిత వ్యాజ్య స్వభావం ఉందని హైకోర్టు సింగిల్ జడ్జి అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో ఈ వ్యాజ్యాన్ని పిల్గా పరిగణించి విచారణ జరిపేందుకు ఫైల్ను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్ర నేతృత్వంలోని ధర్మాసనం వద్దకు విచారణకు వచ్చేలా తగిన చర్యలు తీసుకోవాలని హైకోర్టు రిజిస్ట్రీని ఆదేశించారు. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఆర్.రఘునందన్ రావు ఈ మేరకు ఉత్తర్వులిచ్చారు.
చంద్రబాబు నాయుడు హయాంలో: కాపులకు 5 శాతం రిజర్వేషన్ అమలు చేసేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ కాపు సంక్షేమ సేన వ్యవస్థాపక అధ్యక్షుడు హరిరామ జోగయ్య హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు కేంద్రం కల్పించిన 10 శాతం రిజర్వేషన్లో 5% కాపులకు కేటాయిస్తూ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హయాంలో గత ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాన్ని అమలు చేసేలా ఆదేశాలు జారీ చేయాలని కోరారు.
కొద్ది రోజుల క్రితం దీక్ష: ఇటీవల ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన సింగిల్ జడ్జి.. వ్యాజ్య విచారణ అర్హతపై కౌంటర్ వేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించిన విషయం తెలిసిందే. అదే విధంగా కాపు రిజర్వేషన్పై కొద్ది రోజుల క్రితం కాపు సంక్షేమ సేన వ్యవస్థాపక అధ్యక్షుడు హరిరామ జోగయ్య నిరాహార దీక్ష తలపెట్టగా.. ఆయన వయసు, ఆరోగ్యరీత్యా దీక్షను విరమించాలని జనసేన అధినేత పవన్కల్యాణ్ విజ్ఞప్తి చేశారు. వేరే మార్గంలో పోరాడదామని చెప్పి దీక్షను విరమింపచేశారు.
భారీ ఎత్తున ఉద్యమం: అదేవిధంగా కాపు రిజర్వేషన్ కోసం కొన్ని సంవత్సరాల క్రితం పెద్ద ఎత్తున ఉద్యమం కూడా చేశారు. 2016వ సంవత్సరం జనవరి నెలలో కాకినాడ - జగ్గంపేట మధ్య.. కాపు ఉద్యమ నేపథ్యంలో జరిగిన ఆందోళనల్లో రైలును దహనం చేయడం అప్పట్లో తీవ్ర చర్చనీయాంశమైంది. పలువురిపై కేసులు నమోదు చేశారు.
ఇవీ చదవండి: