కరోనా అనంతర పరిస్థితులు, పరిణామాలను అధిగమించేందుకు ఐటీ రంగంలో చేపట్టాల్సిన చర్యలపై విజయవాడలో ఏప్రిల్ 2వ తేదీన రౌండ్ టేబుల్ సదస్సు నిర్వహించనున్నట్లు పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతం రెడ్డి వెల్లడించారు. ఐటీ రంగంలో పెట్టుబడులు, ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా విజయవాడ నోవాటెల్ హోటల్లో ఐటీ సీఈవోలతో రాష్ట్ర ప్రభుత్వం రౌండ్ టేబుల్ సదస్సు నిర్వహిస్తున్నట్లు మంత్రి గౌతమ్ రెడ్డి వెల్లడించారు. ఐటీ, ఎలక్ట్రానిక్స్ సంస్థలతో జరిగే ఈ సమావేశంలో వర్క్ ఫ్రమ్ హోమ్, నైపుణ్యం, ఉపాధి, కాన్సెప్ట్ సిటీలు, ఇంటర్నెట్ లైబ్రరీ అంశాలపై చర్చించే అవకాశం ఉందని మంత్రి పేర్కొన్నారు.
ఐటీ బకాయిలపై ఆరా
ఐటీ సంస్థలకు చెల్లించాల్సిన బకాయిల గురించి ఆ శాఖకు సంబంధించిన ఉన్నతాధికారులతో మంత్రి గౌతం రెడ్డి చర్చించారు. సంస్థలకు ఇవ్వవలసిన ప్రోత్సాహకాల బకాయిల విడుదల పై మంత్రి మేకపాటి ఆరా తీశారు. 2018 నుంచి 2021 వరకూ ఏపీఈఐటీఏ పరిధిలో ఉన్న ప్రోత్సాహక బకాయిల మొత్తం రూ. 21.18 కోట్లుగా ఉన్నట్లు ఏపీటీఎస్ అధికారులు మంత్రికి వివరించారు. గత ప్రభుత్వ హయాంలో ప్రోత్సాహక బకాయిలు 207 క్లెయిమ్లకు గాను రూ. 49 కోట్లు ఉన్నట్లు స్పష్టం చేశారు. గత రెండేళ్ల బకాయిలు 67 క్లెయిమ్లకు మరో రూ. 11 కోట్లుగా ఉన్నట్లు తెలిపారు. ఉపాధి, లీజ్ రెంటల్, విద్యుత్ రాయితీ, స్టాంప్ డ్యూటీ, డీటీపీ రెంటల్ సబ్సిడీల వారీగా క్లెయిమ్లకు ఇవ్వవలసిన మొత్తాన్ని వేర్వేరుగా మంత్రికి ప్రజంటేషన్ ఇచ్చారు.
ఇదీ చదవండి:
కడప స్టీల్ ప్లాంట్ విషయంలో... ప్లాన్ 'బీ' అమలు చేస్తాం: గౌతమ్రెడ్డి