తెలంగాణలో నిర్వహించనున్న ప్రవేశ పరీక్షల షెడ్యూల్లో విద్యా శాఖ మార్పులు చేసింది. కరోనాతో వాయిదా పడిన ప్రవేశ పరీక్షల సమయాన్ని రీషెడ్యూల్ చేసింది. జులైలో ప్రవేశ పరీక్షలు జరగాల్సి ఉండగా ఆగస్టులోనే అన్ని రకాల ప్రవేశ పరీక్షలు పూర్తయ్యేలా తేదీలను ఖరారు చేసింది. జులైలో డిగ్రీ, పీజీ ఆఖరి సంవత్సరం పరీక్షలు నిర్వహించాలని విశ్వవిద్యాలయాల ఉపకులపతులను మంత్రి ఆదేశించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ఇంటర్ ద్వితీయ సంవత్సర ఫలితాలను వచ్చే వారంలో విడుదల చేయనున్నామని అందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు మంత్రి వివరించారు. పాఠశాల హాజరు పై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్న మంత్రి... ప్రత్యక్ష తరగతులకే ముఖ్యమంత్రి మొగ్గు చూపుతున్నట్లు తెలిపారు. త్వరలో నిర్ణయం తీసుకుంటామని సూచనప్రాయంగా వెల్లడించారు.
ఆగస్టు 4 నుంచి 10 వరకు ఎంసెట్
రాష్ట్రంలో ఎంసెట్ ప్రవేశ పరీక్షను ఆగస్టు 4 నుంచి 10 వరకు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. ఎంసెట్ ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్షను ఆగస్టు 4,5,6 తేదీల్లో, ఎంసెట్ అగ్రికల్చర్, మెడికల్ ప్రవేశ పరీక్షను ఆగస్టు 9,10 తేదీల్లో నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆగస్ట్ 3న ఈసెట్ ఆగస్టు 11 నుంచి 14 వరకు పీజీఈసెట్.. 19 నుంచి 20 వరకు ఐసెట్ ఆగస్టు 23న లాసెట్ 24,25న ఎడ్సెట్... జూలై 17న పాలిసెట్ పరీక్షల తేదీలు ఖరారు చేశారు. కొవిడ్ మార్గదర్శకాలకు అనుగుణంగా తగిన జాగ్రత్తలతో పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ప్రభుత్వ, ప్రైవేటు టీచర్లకు టీకా
బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీల గురుకులాలపై సంబంధిత మంత్రులతో సమావేశమై తదుపరి నిర్ణయం తీసుకుంటామని మంత్రి తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేటు టీచర్లకు టీకా ప్రక్రియపై ముఖ్యమంత్రి కేసీఆర్కు ప్రతిపాదనలు పంపామని... వారికి రిస్క్ టేకర్స్గా గుర్తించాలని కోరినట్లు మంత్రి వివరించారు. విద్యాసంస్థలు అధిక ఫీజులు వసూలు చేయకుండా గత ఏడాది విడుదల చేసిన జీవో 46ని కొనసాగించమని ముఖ్యమంత్రి కేసీఆర్ అదేశించారన్న మంత్రి.. రెండ్రోజుల్లో ప్రైవేటు విద్యా సంస్థలతో సమావేశం నిర్వహిస్తామన్నారు. కరోనా వేళ తల్లిదండ్రులకు ఫీజుల భారం తగ్గించేందుకు 20 నుంచి 30 శాతం రాయితీలు ఇవ్వాలని కోరతామని ప్రభుత్వం వెల్లడించింది.
ఇదీ చదవండి: Chandrababu: మహిళలకు రియల్ టైం భద్రత కల్పించాలి: చంద్రబాబు