సైబర్ నేరాలకు మహిళలు బలైపోతున్నారు. సామాజిక మాధ్యమాల్లో హాయ్ అంటూ మొదలుపెట్టి... రహస్య సమాచారాన్ని సేకరించి... ఆపై వేధిస్తున్న కేసులు పెరుగుతున్నాయి. ఈ తరహా నేరాలు ఇప్పుడు పోలీసులకు సవాల్గా మారుతున్నాయని హోంమంత్రి మేకతోటి సుచరిత పేర్కొన్నారు. వీటికి అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం సైబర్ మిత్ర ఏర్పాటు చేసిందని తెలిపారు.
విజయవాడలోని ఓ ప్రైవేటు హోటల్లో... మహిళలపై జరుగుతున్న సైబర్ నేరాలు అనే అంశంపై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. మహిళల రక్షణకు ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తుందని హోంమంత్రి అన్నారు. సాంకేతిక పరిజ్ఞాన వినియోగంతోనే నేరాలు పెరుగుతున్నట్లు అభిప్రాయపడ్డారు.
అపరిచితుల ఫోన్ ద్వారానే... నేరాలు జరుగుతున్నాయని డీజీపీ గౌతం సవాంగ్ పేర్కొన్నారు. సైబర్ క్రైంపై అవగాహన కల్పించేందుకు ఓ పుస్తకాన్ని విడుదల చేశారు. సైబర్ నేరాలు అరికట్టేందుకు... ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నామని డీజీపీ చెప్పారు. మహిళలు ఫిర్యాదు చేయాలంటే భయపడేవారని... ఇప్పుడు స్పందన కార్యక్రమానికి వచ్చి ఫిర్యాదు చేస్తున్నారని పేర్కొన్నారు.