రాష్ట్రంలో అమృత్ పథకంలో భాగంగా జరిగిన పనులపై సమగ్ర అధ్యయనానికి ప్రభుత్వం ఆదేశించింది. 25 శాతం కంటే తక్కువ జరిగిన పనులపై క్షేత్రస్థాయి పరిశీలన జరిపి... సమగ్ర నివేదికలు అందచేయాలని పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఆదేశించారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ అర్భన్ ఫైనాన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఎండీని ఆదేశించారు.
ఇప్పటికే పూర్తయిన పనుల నాణ్యతపై తనిఖీలు చేపట్టాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో మంచినీటి సరఫరా, మురుగునీటి పారుదల, సెప్టేజీ నిర్వహణతో పాటు పార్కుల నిర్మాణం వంటి పనులను కేంద్ర ప్రభుత్వ తోడ్పాటుతో చేపట్టారు. 25శాతం కంటే తక్కువ, అసలే ప్రారంభం కాకుండా 35శాతం పనులకు సంబంధించిన వాటిని స్థానిక ఎమ్మెల్యేలతో కలిసి... మున్సిపల్ కమిషనర్లు తనిఖీ చేయాలని నిర్దేశించారు.
టెండర్ల ప్రక్రియను అధ్యయనం చేసి... అధిక ధరలకు టెండర్లు ఖరారు చేసినవాటిని గుర్తించాలని సూచించారు. ప్రజా ధనాన్ని ఆదా చేసేందుకు వీలుగా... రివర్స్ టెండరింగ్ వెళ్లే అవకాశాలపై ఉన్నతాధికారుల కమిటీ అధ్యయనం చేయాలని ఆ ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.
ఇదీ చదవండీ...వైద్య విధాన పరిషత్ ఉద్యోగుల విభజన పూర్తి