అక్రమాస్తుల కేసుల్లో నిందితులుగా ఉన్న వారికి ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి కీలక పదవులు కట్టబెడుతూ సాక్షులను పరోక్షంగా భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఎంపీ రఘురామకృష్ణరాజు సోమవారం సీబీఐ కోర్టుకు నివేదించారు. బెయిలు రద్దు పిటిషన్పై జగన్ దాఖలు చేసిన కౌంటరుకు రఘురామకృష్ణరాజు కౌంటరు దాఖలు చేశారు. తనపై కేవలం ఎఫ్ఐఆర్లే నమోదయ్యాయని, ఇప్పటివరకు ఒక్క కేసులో కూడా అభియోగపత్రం దాఖలు చేయలేదని ఎంపీ చెప్పారు. ఒకవేళ కేసులు నిజమేననుకున్నా... నాపై ఉన్న ఆరోపణలను పరిశీలిస్తే... జగన్ చేసిన ఆర్థిక మోసాలు, ప్రభుత్వ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేయడం, సహజ వనరులను కొల్లగొట్టడం వంటి వాటితో పోలిస్తే చిన్నవేనని పేర్కొన్నారు. తనపై 7 కేసులున్నాయన్నారని, ఇందులో ఒకటి ఈ పిటిషన్ దాఖలు చేసిన తర్వాత మంగళగిరి సీఐడీ పోలీసులు నమోదు చేసినదిగా గమనించాలని చెప్పారు. వ్యతిరేక గళాలను నొక్కేస్తున్నారనడానికి ఇదో ఉదాహరణని, బెయిలు రద్దు చేయడానికి ఈ ఒక్కటి చాలని ఆయన వివరించారు.
సీబీఐ అధికారుల తీరు అందరికీ తెలిసిందే..
సీబీఐ కేంద్రం అధీనంలో ఉన్న మాట వాస్తవమే అయినప్పటికీ అందులోని వ్యక్తుల నియంత్రణ భిన్నంగా ఉంటుందని ఎంపీ రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు. సీబీఐ అధికారులే విచారణను, దర్యాప్తును పక్కదారి పట్టించిన సంఘటనలున్నాయని చెప్పారు. ఆ సంస్థలో దర్యాప్తుతో సంబంధం ఉన్న పలువురు వ్యక్తుల విశ్వసనీయత ప్రశ్నార్థకమని, దీనికి ఆధారాలున్నాయని పేర్కొన్నారు. జగన్ బెయిల్ను రద్దు చేయాలంటూ తాను వేసిన పిటిషన్లోని అంశాలను కనీసం పరిశీలించకుండానే సీబీఐ దాన్ని తిరస్కరించడాన్ని కోర్టు పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. తన బెయిల్ రద్దు విషయమై సాక్షాత్తూ దర్యాప్తు సంస్థే ఎలాంటి ఫిర్యాదూ చేయలేదని జగన్ అంటున్నారని, సీబీఐ ఎందుకు దరఖాస్తు చేయలేదో ప్రపంచానికి తెలుసని చెప్పారు. తాను బెయిలు షరతులను ఉల్లంఘించనందునే దరఖాస్తు చేయలేదని జగన్ భావిస్తున్నట్లుందని, అయితే వాస్తవం మాత్రం అందుకు భిన్నమని పేర్కొన్నారు. ఈ పిటిషన్పై సోమవారం సీబీఐ కోర్టు విచారణ చేపట్టగా.. పిటిషనరు తరఫు న్యాయవాది ఎస్.శ్రీవెంకటేశ్ కోరడంతో విచారణను జులై 1వ తేదీకి వాయిదా వేసింది.
పెన్నా కేసులో మరో రెండు డిశ్ఛార్జి పిటిషన్లు
జగన్ అక్రమాస్తుల వ్యవహారంలో పెన్నా సిమెంట్స్కు సంబంధించిన కేసులో మరో రెండు డిశ్ఛార్జి పిటిషన్లు దాఖలయ్యాయి. సీబీఐ కోర్టులో నిందితులైన మాజీ ఐఏఎస్ శామ్యూల్, పి.ఆర్.ఎనర్జీ లిమిటెడ్లు తమ పేర్లను తొలగించాలని కోరుతూ వేర్వేరుగా వీటిని దాఖలు చేశారు. పెన్నా సిమెంట్స్ దాఖలు చేసిన డిశ్ఛార్జి పిటిషన్తోపాటు అరబిందో, హెటిరో కేసుల విచారణ ఈనెల 21వ తేదీకి వాయిదా పడింది. ఓబుళాపురం కేసులో నిందితులైన ఐఏఎస్ అధికారి వై.శ్రీలక్ష్మి, గనుల శాఖ డైరెక్టర్ వి.డి.రాజగోపాల్, మాజీ ఐఏఎస్ కృపానందం దాఖలు చేసిన డిశ్ఛార్జి పిటిషన్లపై విచారణ కూడా 21కి వాయిదా పడింది.
ఇదీ చదవండి: