ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు మాధ్యమం స్థానంలో ఆంగ్ల మాధ్యమం తీసుకొచ్చే చర్యల్లో భాగంగా పాఠ్యపుస్తకాల ముద్రణ, శిక్షణ తరగతులు తదితర చర్యలు చేపడితే అధికారులకు ఇబ్బందులు తప్పవని హైకోర్టు మరోమారు హెచ్చరించింది. ఈ వ్యవహారంపై ముందుకెళితే ఆ ఖర్చును బాధ్యులైన అధికారుల నుంచే రాబడతామని తేల్చి చెప్పింది. పూర్తిగా ఆంగ్ల మాధ్యమం తీసుకురావడం సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధంగా ఉందని వ్యాఖ్యానించింది. తదుపరి విచారణ నాటికి పూర్తి వివరాలతో ప్రమాణపత్రం దాఖలు చేయాలని పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిని ఆదేశించింది. దాఖలు చేయడంలో విఫలమైతే స్వయంగా హాజరు కావాలని స్పష్టం చేసింది.
నిర్దిష్ట గడువులోపు ప్రమాణపత్రం దాఖలు చేయకపోతే ఆంగ్ల మాధ్యమంపై ‘స్టే’ ఉత్తర్వులు ఇస్తామని తేల్చి చెప్పింది. విచారణను ఫిబ్రవరి 4కు వాయిదా వేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ ఎన్.జయసూర్యతో కూడిన ధర్మాసనం సోమవారం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ పాఠశాలల్లో వచ్చే విద్యా సంవత్సరం 1వ తరగతి నుంచి 6వ తరగతి వరకు ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టేందుకు నవంబరు 20న రాష్ట్ర ప్రభుత్వం జీవో 85 జారీ చేసింది. దీన్ని సవాలు చేస్తూ తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం మండలం రావిపాడు గ్రామానికి చెందిన సామాజిక ఉద్యమకారుడు, భాజపా నాయకుడు రాంభొట్ల శ్రీనివాస సుధీష్, అసిస్టెంట్ ప్రొఫెసర్ గుంటుపల్లి శ్రీనివాస్ హైకోర్టులో వేర్వేరుగా ప్రజాహిత వ్యాజ్యాలు దాఖలు చేశారు.
గడువివ్వండి: ఏజీ