KTR Fires On BJP Government : తెలంగాణ నుంచి బీజేపీ ఎంపీలను గెలిపిస్తున్నప్పటికీ ఏమాత్రం ప్రయోజనం లేకుండా పోయిందని బీఆర్ఎస్ కార్యనిర్వహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. ఎక్స్ వేదికగా స్పందించిన ఆయన కష్టకాలంలో రాష్ట్రం నుంచి 8 మంది బీజేపీ ఎంపీలు గెలిచినప్పటికీ ఎన్డీఏ ప్రభుత్వం హైదరాబాద్ మెట్రో విస్తరణకు ఒక్క రూపాయి కూడా నిధులు కేటాయించలేదని పేర్కొన్నారు. గతంలో పలుమార్లు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేసినా ఎలాంటి ఫలితం లేకుండా పోయిందని తెలిపారు.
కేంద్ర ప్రభుత్వం గత పదిహేళ్లుగా వివిధ రాష్ట్రాల్లోని 20 మెట్రో రైల్ ప్రాజెక్టులకు నిధులు ఇచ్చిందని కేటీఆర్ తెలిపారు. ఉత్తరప్రదేశ్, గుజరాత్, దిల్లీ, మధ్యప్రదేశ్, కేరళతో పాటు దిల్లీ - ఘాజియాబాద్ మధ్య రాపిడ్ రైలు ప్రాజెక్ట్ కు కేంద్ర ప్రభుత్వం భారీగా నిధులు ఇచ్చిందని వివరించారు. కానీ హైదరాబాద్ మెట్రోకు మాత్రం ఒక్క పైసా కూడా నిధులు కేటాయించలేదని ట్వీట్లో పేర్కొన్నారు.