TDP Leaders Participated in Palle Panduga Program Across State : గ్రామాల అభివృద్ధే ధ్యేయంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పల్లె పండుగ కార్యక్రమాలు రాష్ట్రవ్యాప్తంగా అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఏలూరు జిల్లా నూజివీడు మండలం వెంకటాయపాలెంలో మంత్రి కొలుసు పార్థసారథి పల్లె పండుగ కార్యక్రమాన్ని ప్రారంభించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. గ్రామంలో సిమెంట్ రోడ్డు నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేశారు.
పల్లె పండుగ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన మంత్రి పార్థసారథికి గిరిజనులు బంజారా నృత్యం చేస్తూ వినూత్నంగా స్వాగతం పలికారు. అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం రాయంపల్లెలో 8 లక్షల రూపాయలతో సీసీ రోడ్ల నిర్మాణానికి అధికారులతో కలసి టీడీపీ నాయకులు భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు. పల్లెల్లో పండుగ వాతావరణం తెచ్చేలా కూటమి ప్రభుత్వం పని చేస్తుందని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. ఆనాడు చంద్రబాబు స్పూర్తితో గ్రామాల్లో రోడ్లు వేశారని, జగన్ ప్రభుత్వం 12 వేల కోట్ల కేంద్రం నిధులను ఖర్చు చేయకుండా దారి మళ్లించారని ఆరోపించారు. పవన్కల్యాణ్ మంత్రిగా బాధ్యత తీసుకున్నాక గ్రామాలు అభివృద్ధి చేస్తున్నారన్నారు.
NRGS ఫండ్స్ తెచ్చి వంద రోజుల్లో రూ.4500 కోట్లతో అభివృద్ధి చేపట్టారని తెలిపారు. గతంలో పంచాయతీ ఆఫీస్లకు పార్టీ రంగులు వేసుకున్నారని మంత్రి విమర్శించారు. పంచాయతీ వ్యవస్థను నిర్వీర్యం చేశారన్నారు. కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి అంటే ఏమిటో? గ్రామ స్వరాజ్యం ఏమిటో చూస్తారని మంత్రి కొల్లురవీంద్ర అన్నారు.
ప్రజల సమస్యల పరిష్కారానికి అవసరమైన రహదారుల నిర్మాణానికి పల్లె పండుగ కార్యక్రమాన్ని నిర్వహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల లక్ష్మీ దుర్గేష్ వెల్లడించారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలంలోని వివిధ గ్రామాలలో నిర్వహించిన పల్లె పండుగ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఉపాధి హామీ పథకం కింద మంజూరైన నిధులతో గ్రామాల్లో సిమెంట్ రహదారుల నిర్మాణానికి కలెక్టర్ ప్రశాంతితో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఉపాధి హామీ పథకం కింద రాష్ట్రంలో నిధులు మంజూరైన మొదటి నియోజకవర్గ నిడదవోలని వెల్లడించారు. నియోజకవర్గంలో 11 కోట్ల రూపాయలతో నిర్మించే పనులకు శంకుస్థాపన చేయనున్నట్లు వెల్లడించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీల సారధ్యంలో రాష్ట్రంలో సర్వతో ముఖాభివృద్ధి సాధించడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతుందని మంత్రి దుర్గేష్ వెల్లడించారు.
సంక్రాంతికి 'పల్లె' కళకళలాడాలి - చంద్రబాబు అపార అనుభవం మాకు ఎంతో బలం: పవన్
ఎన్టీఆర్ జిల్లా, తిరువూరు నియోజకవర్గం విసన్నపేట మండలం, విసన్నపేట పట్టణం ఎస్సీ కాలనీలో పల్లె పండుగ వారోత్సవాలు నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా కొలికపూడి శ్రీనివాసరావు సీసీ రోడ్డుకు శంకుస్థాపన చేశారు. పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గంలో రహదారులు మురుగు కాలువలు మినీ కులాలు అభివృద్ధికి పశ్చిమగోదావరి జిల్లా తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ శ్రీకారం చుట్టారు. మురుగు కాలువల అభివృద్ధి ఏడున్నర కోట్ల రూపాయలు, మినీ గోకులాల అభివృద్ధి రెండున్నర కోట్ల రూపాయలతో చేపట్టనున్నట్లు ఎమ్మెల్యే రాధాకృష్ణ వివరించారు.
పవన్ కల్యాణ్ ఒక వ్యక్తి కాదు ఒక శక్తి అని గత ఎన్నికలలో నిరూపించారని మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి అన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాకే పల్లెల్లో అభివృద్ధి చూస్తున్నామన్నారు. మచిలీపట్నం, రేపల్లె రైల్వే ప్రాజెక్టును పూర్తి చేసి ప్రజల కల సాకారం చేస్తామని ఎంపీ బాలశౌరి తెలిపారు. పెనమలూరు నియోజకవర్గంలో కంకిపాడులో పల్లె పండుగ సభలో ఉపముఖ్యమంత్రి పవన్ పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని ఎమ్మెల్యే బోడెప్రసాద్ అన్నారు.
గత ఐదేళ్లల్లో గ్రామాల అభివృద్ధికి ఒక్క రూపాయి ఖర్చు పెట్టలేదని ఆరోపించారు. ఎన్డీయే కూటమి వచ్చాక రూ. 4500 కోట్లు గ్రామాల అభివృద్ధికి ఖర్చు చేస్తున్నారన్నారు. చాలా గ్రామాల్లో కనీస మౌలిక సదుపాయాలు లేవని విమర్శించారు. తన నియోజకవర్గంలో పది గ్రామాల్లో తాను గతంలోనే ఎమ్మెల్యేగా అభివృద్ధి చేశానని తెలిపారు. ఈ ఐదేళ్లల్లో 90 శాతం గ్రామాల్లో అన్ని మౌలిక వసతులు కల్పిస్తామని హామీ ఇచ్చారు.