Man Died Due to Electric Shock: విద్యుత్ షాక్ తగిలి టిప్పర్ యజమాని మృతి చెందిన ఘటన అనంతపురం జిల్లాలో చోటు చేసుకంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం డి.హీరేహాళ్ మండలంలోని సోమలాపురం రైల్వే స్టేషన్ సమీపంలో ఇనుప ఖనిజం లోడింగ్కు వచ్చిన టిప్పర్ హై టెన్షన్ విద్యుత్ తీగలు తగలడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో రాయదుర్గం మండలం కదరంపల్లి గ్రామానికి చెందిన సైఫుల్ల (30) మరణించాడు. ఉదయం తన టిప్పర్కు గ్రీస్ పట్టడానికి టిప్పర్ హైడ్రాలిక్ పైకి ఎత్తాడు. దీంతో పైనున్న హై టెన్షన్ విద్యుత్ తీగల తగిలి మంటలు చెలరేగాయి.
విద్యుత్ షాక్కు గురై తీవ్ర అస్వస్థత గురైన సైఫుల్లను కొంతమంది రాయదుర్గం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అప్పటికే అతను మరణించినట్లు వైద్యులు తెలిపారు. సైఫుల్లకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. సైఫుల్ల వ్యవసాయంతో పాటు టిప్పర్ నడిపేవాడు. సోమలాపురం రైల్వే స్టేషన్లో వ్యాగిన్ నుంచి డి హీరేహాళ్లో ఐరన్ ఓవర్ ఫ్యాక్టరీలకు టిప్పర్ల ద్వారా ముడిఖనిజం తరలిస్తారు. ఈ నేపథ్యంలో టిప్పర్ ఓనరు లోడింగ్కు వచ్చాడు. లోడింగ్ ఆలస్యం కావడంతో రోడ్డు పక్కన టిప్పర్ హైడ్రాలిక్ గ్రీసింగ్ చేస్తుండగా విద్యుత్తు ప్రమాదం చోటు చేసుకుంది.
విద్యుత్ ఘాతానికి టిప్పర్ పూర్తిగా కాలిపోయింది. టిప్పర్తో పాటు యజమాని కూడా మృతి చెందడంతో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. పొట్టకూటి కోసం వెళ్లి టిప్పర్ యజమాని మృతి చెందడంతో కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. సోమలాపురం రైల్వే స్టేషన్లో విద్యుత్ ప్రమాదాలు చోటు చేసుకోకుండా సంబంధిత అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
విశాఖలో దారుణం - ల్యాప్టాప్ కోసం కన్న తల్లినే కడతేర్చిన కుమారుడు