KCR Helps Constable Kistaiah Daughter : తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలు అర్పించిన అమరుడు కానిస్టేబుల్ కిష్టయ్య కుటుంబానికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మరోమారు అండగా నిలిచారు. కిష్టయ్య కుమార్తె ఎంబీబీఎస్ విద్య కోసం గతంలో ఆర్థికసాయం చేసిన ఆయన పీజీ వైద్యవిద్య కోసం అవసరమైన సాయాన్ని కూడా అందించారు. ఈ మేరకు రూ.24 లక్షల చెక్కును కిష్టయ్య కుటుంబానికి కేసీఆర్ అందించారు.
KCR help to Martyr Constable family : కుటుంబపెద్దను కోల్పోయిన ఆ కుటుంబానికి తాను అండగా నిలుస్తానని బీఆర్ఎస్ అధినేత ఉద్యమ సమయంలో హామీ ఇచ్చారు. కిష్టయ్య పిల్లల చదువు సహా ప్రతి కష్టకాలంలో అండగా నిలుస్తూ వచ్చారు. కిష్టయ్య కుమార్తె పీజీ వైద్యవిద్య కోసం ఇవాళ చెక్ అందించి తన నివాసంలో వారితో కలిసి భోజనం చేశారు. కుటుంబ కష్టసుఖాలను అడిగి తెలుసుకున్నారు.
తల్లికి ఏ కష్టం రాకుండా చూసుకోండి : రాష్ట్రం కోసం కిష్టయ్య ప్రాణత్యాగం చేసినప్పుడు చిన్నపిల్లలుగా ఉన్న వారిని తల్లి ఎంతో కష్టపడి సాదుకొని చదివించిందన్న కేసీఆర్ వారు ఇప్పుడు ప్రయోజకులయ్యారని అన్నారు. తల్లికి ఏ కష్టం రాకుండా చూసుకోవాలని, ఏ సమయంలో నైనా తన సహకారం ఉంటుందని తెలిపారు. తమ కుటుంబాన్ని ఇంటి పెద్దలా ఆదుకుంటున్న కేసీఆర్కు కిష్టయ్య కుటుంబం ధన్యవాదాలు తెలిపింది.