Father Demanding For His Son : హైదరాబాద్లో తండ్రి, బంగ్లాదేశ్లో తల్లి, అమ్మమ్మ దగ్గర పిల్లాడు. ఇదీ ఆ కుటుంబ కథ. తండ్రి, కుమారుడికి ఉన్నది రెండు దేశాల మధ్య దూరం. భార్య చేసిన మోసానికి కన్న ప్రేమకు దూరమయ్యాడు ఆ తండ్రి. కుమారుడి ఆచూకీ కూడా చెప్పకుండా తన జీవితంతో ఆడుకుంటున్నారని ప్రభుత్వమే తమని ఆదుకొని కుమారున్ని తన దరికి చేర్చాలని వేడుకుంటున్నాడు.
ఇదీ జరిగింది : వికారాబాద్ జిల్లా చౌడాపూర్ మండలం లింగాపూర్ గ్రామానికి చెందిన మాగాని తిరుపతి ముంబయిలో భవన నిర్మాణ కూలీ. 2016లో అక్కడ రియా అనే మహిళ పరిచయమైంది. వీరిద్దరికీ గతంలోనే విడాకులు అయ్యాయి. అయినా మనసులు కలవడంతో ఇద్దరూ ముంబయిలోనే వివాహం చేసుకుని కాపురం పెట్టారు. 2017లో వీరికి కుమారుడు విశాల్ జన్మించాడు. ఏడాది వరకు కాపురం సవ్యంగానే సాగింది.
భార్యపై అనుమానంతో కుమార్తెను పొట్టనపెట్టుకున్న కసాయి - FATHER KILLED HIS DAUGHTER
మరో వ్యక్తితో వివాహం : తిరుపతి తన సొంతూరుకు వచ్చిన సమయంలో రియా ముంబయిలో ఇంకొకర్ని వివాహమాడింది. విషయం తెలిసి ముంబయికి వెళ్లన తిరుపతికి బాబుని తీసుకుని వెళ్లాలని చెప్పింది రియా. తిరుపతి ఆ బాలుడిని హైదరాబాద్లోని బాలాపూర్కు తీసుకొచ్చి ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాడు. కొన్నాళ్లు బిడ్డను పట్టించుకోని రియా 2022లో విశాల్ను చూస్తానని తిరుపతిని ముంబయికి రావాలని కోరింది. కుమారుడిని అక్కడికి తీసుకెళ్లగానే రియా మూడో భర్త మరికొందరు దాడి చేసి బాబును వాళ్లతో తీసుకెళ్లారని తిరుపతి చెబుతున్నాడు.
"వివాహం చేసుకున్నాక నా భార్యతో పాటు హైదరాబాద్లోని షాద్నగర్కు వచ్చాం. అయితే రెండు నెలలకే ఉండనని చెప్పి వెళ్లిపోయింది. నన్ను ముంబయికి రావాలని కోరింది. తీరా అక్కడకు వెళ్లే సరికి వారి బంధువులంతా కలిసి నాపై దాడి చేసి బాబును తీసుకుపోయారు. నేను పోలీసులకు ఫిర్యాదు చేసినా అంతగా పట్టించుకోలేదు"- మాగాని తిరుపతి, బాధితుడు
కుమారుడిని తన వద్దకు చేర్చాలని వేడుకోలు : రియా స్వస్థలం బంగ్లాదేశ్లోని జెస్సూర్ అని తిరుపతి తెలుసుకున్నాడు. రియా చెల్లెలి భర్త షఫీ ద్వారా విశాల్ను భారత్కు తీసుకొచ్చేందుకు ప్రయత్నించాడు. దీన్ని అవకాశంగా భావించిన షఫీ తిరుపతికి వాట్సాప్ ద్వారా విశాల్ వీడియోలు పంపించి పలుమార్లు డబ్బు వసూలు చేశారని వాపోతున్నాడు. బంగ్లాదేశ్ వెళ్లిన తర్వాత రియా తన కుమారుడిని పట్టించుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు. ఇటీవలే తిరుపతి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ని కరీంనగర్లో కలిసి తన సమస్య వివరించాడు. ఈ విషయంలో సీఎం రేవంత్రెడ్డిని కూడా కలుస్తానని, తన కుమారుడు విశాల్ను తనకు అప్పగించేలా కృషి చేయాలని వేడుకుంటున్నాడు.
ఆస్తి కోసం అస్థిత్వాన్నే చంపుకొన్నాడు - తల్లి, ఇద్దరు కుమార్తెల దారుణ హత్య - Son Killed Mother And Daughters