Gang Attack On Police : హైదరాబాద్లో రౌడీ మూకల ఆగడాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఓ కేసు దర్యాప్తులో భాగంగా వెళ్లిన పోలీసులపై రౌడీలు దాడికి యత్నించిన ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన గండిపేట బృందావన్ కాలనీలో జరిగింది. అనంతరం నిందితులను పోలీసులు పట్టుకున్నారు.
ఇదీ జరిగింది : ఓ కిడ్నాప్ కేసు దర్యాప్తులో భాగంగా నిందితులను పట్టుకునేందుకు పోలీసులు నగరంలోని గండిపేట బృందావన్ కాలనీకి వెళ్లారు. అయితే వారిని పట్టుకునే క్రమంలో పోలీసులపై కత్తులు, హాకీ స్టిక్స్తో దాడికి యత్నించింది ఆ రౌడీ మూక. ఈ అనూహ్య పరిణామంతో అప్రమత్తమైన పోలీసులు, స్టేషన్కు సమాచారం ఇచ్చి అదనపు బలగాలను రప్పించారు. దీంతో బలగాలు అక్కడకు చేరుకున్నాయి. వారిని చూసి పరారయ్యేందుకు రౌడీలు యత్నించారు. పారిపోతున్న వారిలో నలుగురు దుండగులను పోలీసులు పట్టుకున్నారు.
డోన్లో రెచ్చిపోయిన వైఎస్సార్సీపీ నాయకులు - టీడీపీ నాయకులపై కర్రలతో దాడి - YSRCP Leaders Attack
ఈ నెల 10న నరేందర్, ప్రవీణ్ అనే ఇద్దరు వ్యక్తులు కిడ్నాప్నకు గురయ్యారు. కిడ్నాపర్ల నుంచి ఎలాగోలా తప్పించుకున్న వారు పోలీసులను ఆశ్రయించారు. తమ స్థలాన్ని కబ్జా చేసి, తమను కిడ్నాప్ చేసి బెదిరించారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. రూ.25 కోట్ల విలువైన వీరి స్థలంలో రౌడీ మూకలు తిష్టవేశారు. ఈ క్రమంలోనే నిందితులను అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరిచారు. రౌడీలకు ఉప్పర్పల్లి కోర్టు శుక్రవారం ఏడు రోజుల రిమాండ్ విధించింది. నరేందర్, ప్రవీణ్ను ఇటీవల ఇదే గ్యాంగ్ కిడ్నాప్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.
బుల్లెట్ కలకలం : మరో ఘటనలో నార్సింగి పరిధిలోని బైరాగిగూడలో బుల్లెట్ కలకలం రేపింది. తమ ఇంట్లోకి బుల్లెట్ దూసుకువచ్చిందని యజమాని వెల్లడించారు. బుల్లెట్ చూసి కుటుంబ సభ్యులు భయాందోళనకు గురయ్యారని తెలిపారు. దీంతో ఇంటి యజమాని నార్సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియరావాల్సి ఉంది.