Draupadi Murmu Ayodhya visit : అయోధ్య రామమందిరాన్ని బుధవారం సందర్శించారు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము. గర్భగుడిలోకి వెళ్లి రాముడికి హారతిని ఇచ్చారు. అనంతరం దేవాలయ ప్రతినిధులు ఆమెకు రామాలయ ప్రతిమను కానుకగా ఇచ్చారు. దీనికి సంబంధించిన ఫొటోలను ఆమె ఎక్స్లో షేర్ చేశారు. రామమందిరాన్ని నిర్మించాక రాష్ట్రపతి తొలిసారిగా దర్శించుకున్నారు. అంతకుముందు ఉదయం అయోధ్యలోని మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న రాష్ట్రపతి ముర్ముకు గవర్నర్ ఆనందీ బెన్ పటేల్ ఘన స్వాగతం పలికారు. సాయంత్రం సరయూ నదికి హారతి ఇచ్చి పూజలు చేశారు ముర్ము. అనంతరం హనుమాన్ గఢీ ఆలయాన్ని సందర్శించారు. ఈమె వెంట గవర్నర్ ఆనంది బెన్ పటేల్ ఉన్నారు.
అయోధ్య రామయ్య ప్రాణప్రతిష్ఠ
Ayodhya Ram Mandir Pran Pratishtha : జనవరి 22న అయోధ్యలో రాముడు కొలువుదీరాడు. బాల రాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి ముఖ్య యాజమాన్గా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యవహరించారు. మోదీ సమక్షంలో ఆలయంలో తొలుత ప్రత్యేక పూజలు చేశారు. తర్వాత గర్భగుడిలో రామ్ లల్లా విగ్రహం వద్ద ప్రధాని మోదీ ప్రాణ ప్రతిష్ట క్రతువును చేపట్టారు. వేదమంత్రోచ్ఛారణ మధ్య పూజాదికాలు నిర్వహించారు. సోమవారం(జనవరి 22) మధ్యాహ్నం 12.20 నుంచి ఒంటి గంట మధ్య అభిజిత్ లగ్నంలో ప్రాణప్రతిష్ఠ వేడుకను నిర్వహించారు. పండితుల సమక్షంలో 51అంగుళాల ఎత్తైన రామ్ లల్లా విగ్రహాన్ని ఆవిష్కరించారు. రాముడికి ప్రధాని మోదీ పుష్పాలు, నైవేద్యం సమర్పించారు. అనంతరం శ్రీరాముడికి ప్రధాని హారతి ఇచ్చారు. విల్లు, బాణం ధరించి, బంగారు ఆభరణాలతో అద్భుతంగా అలంకరించిన బాలరాముడిని చూసి భక్తకోటి పులకరించింది. చిరు దరహాసం, ప్రసన్న వదనంతో బాలరాముడి దర్శన భాగ్యం కలగడం వల్ల ప్రధాని మోదీ సహా అతిథులు, ప్రజలు తన్మయత్వం చెందారు. మైసూర్కు చెందిన శిల్పి అరుణ్ యోగిరాజ్ బాలరాముడి విగ్రహాన్ని రూపొందించారు. 51 అంగుళాల పొడవైన బాలరాముడి విగ్రహం దైవత్వం ఉట్టిపడేలా భక్తులను మంత్రముగ్ధుల్ని చేసేలా తీర్చిదిద్దారు. ఈ పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.