భౌగోళిక రాజకీయ పరిస్థితుల వల్ల తీవ్ర స్థాయిలో అనిశ్చితి ఏర్పడటం ఇటీవలి కాలంలో ఇదే మొదటిసారి. భద్రతా పరమైన నిర్ణయాలు, వాణిజ్య ఏర్పాట్లు, బహుపాక్షిక అవగాహనలు వంటి అంశాలేవైనా ఇప్పుడు సులభంగా ఊహించే విధంగా లేవు. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న అస్థిరత ఇలాంటి పరిస్థితులకు బాటలు వేసింది. ఇందుకు కారణమైనందుకు ఇద్దరిని 'అభినందించాలి'. ఒకరు అమెరికా 45వ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అయితే... కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా 'చక్రవర్తి' షీ జిన్పింగ్ మరొకరు.
'మేక్ అమెరికా గ్రేట్ అగైన్', 'అమెరికా ఫస్ట్' నినాదాలతో ట్రంప్ అధికారంలోకి వచ్చారు. అమెరికా ఉదారతను తన ప్రయోజనాలకు వాడుకుంటున్నారని భాగస్వామ్య దేశాలపై బహిరంగంగానే ఆరోపణలు చేశారు. ముఖ్యంగా జీ7, నాటో దేశాల కూటముల లక్ష్యంగా ఈ వ్యాఖ్యలు చేశారు. శాంతి స్థాపన కోసం అమెరికా గణనీయమైన వ్యయాలకోర్చి వీటిని నెలకొల్పిందని, కానీ సభ్యదేశాలు ఆర్థిక భారాన్ని సమానంగా పంచుకోవడంలేదని మండిపడ్డారు. వీటిని 'ఫ్రీ-లోడర్లు'గా అభివర్ణించారు. అయితే, ట్రంప్ అపహాస్యం చేసిన దేశాల్లో ఒక్కటి కూడా రక్షణ రంగంపై జీడీపీలో 1 శాతం కూడా ఖర్చు చేయడం లేదు.
ఒప్పందాల విస్మరణ
అంతేకాకుండా గతపాలకుల వారసత్వాన్ని రద్దు చేసేందుకు ట్రంప్ ప్రయత్నించారు. మాజీ అధ్యక్షుడు ఒబామా ముద్ర ఉన్న ప్రతి విషయంలో వ్యతిరేకంగా పనిచేశారు. ప్రతిష్టాత్మక టీపీపీ(ట్రాన్స్-పసిఫిక్ భాగస్వామ్యం) వాణిజ్య ఒప్పందం నుంచి వైదొలిగారు. వాతావరణ మార్పులపై చేసుకున్న పారిస్ ఒప్పందం నుంచి బయటకు వచ్చేశారు. ఇరాన్ అణు ఒప్పందం నుంచి వైదొలగడం వంటి ఎన్నో నిర్ణయాలు తీసుకున్నారు.
అమెరికా ఒప్పందం నుంచి వైదొలిగినప్పటికీ ఇరాన్ మాత్రం దానికి కట్టుబడే ఉంది. అయినా.. ఆ దేశంపై ట్రంప్ కఠిన ఆంక్షలు విధించారు. అమెరికాకు అత్యంత ఆప్తులైన జర్మనీ, ఫ్రాన్స్, కెనడా, దక్షిణ కొరియా నేతలతోనూ ప్రతికూల వైఖరి అవలంబించారు ట్రంప్.
అయితే ట్రంప్ ఒక్క విషయాన్ని మాత్రం సరిగ్గా గ్రహించారు. అదే చైనా ముప్పు! అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత 2016 డిసెంబర్లో తైవాన్ నుంచి వచ్చిన అభినందనను అంగీకరించి 35 ఏళ్ల నుంచి అమెరికా పాటిస్తున్న 'వన్ చైనా పాలసీ'కి తెరదించారు.
ఈ చర్యతో చైనాలో కొద్దిపాటి కలవరం మొదలైంది. దీనిని 'తైవాన్ ప్రయోగించిన చిన్న ఉపాయం' అంటూ చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ వ్యాఖ్యానించారు. అమెరికాతో ఏర్పడిన రాజకీయ పునాది చెదిరిపోవడాన్ని చైనా చూడాలనుకోవడం లేదని చెప్పుకొచ్చారు.
సుంకాలు-ఆంక్షలు
అప్పటికి చైనా విషయంలో ట్రంప్ ఆలోచనలు స్పష్టంగానే ఉన్నాయి. దశాబ్దాలుగా అమెరికా నుంచి చైనా పెద్ద ఎత్తున ప్రయోజనం పొందుతోందని ఆయన ఎప్పటి నుంచో విశ్వసిస్తున్నారు. చైనాతో 375 బిలియన్ డాలర్ల వాణిజ్య లోటు ఉండటాన్ని వ్యతిరేకించారు. అమెరికా ప్రయోజనాలను చైనా బలహీనం చేస్తోందని, వాణిజ్య గూఢచర్యంలో నిమగ్నమైందని ఆరోపించారు. హైటెక్ కంపెనీలను తెలివిగా సైనిక శక్తితో తన కనుసన్నల్లో పనిచేయించుకుంటోందని పేర్కొన్నారు. దీంతో చైనా ఉత్పత్తుల దిగుమతులపై సుంకాలు విధించారు. పీపుల్స్ లిబరేషన్ ఆర్మీతో ప్రత్యక్ష సంబంధాలున్న హువావే, జడ్టీఈ వంటి సంస్థలపై ఆంక్షలు విధించారు.
అస్థిరతలకు చైనా ఆజ్యం
చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ వ్యవహారశైలి అగ్నికి ఆజ్యం పోసింది. అవినీతికి వ్యతిరేకంగా అసమ్మతి స్వరం వినిపించే రాజకీయ ప్రత్యర్థులను అణిచేందుకు అంతర్గత నిబంధనలను కఠినతరం చేశారు. శాంతియుతంగా ఎదగాలనే నియమాలను విస్మరించారు. తైవాన్, టిబెట్, హాంకాంగ్, షింజియాంగ్ పట్ల బెదిరింపు వ్యూహాలను అమలు చేశారు. దక్షిణ చైనా సముద్రంలో సైనిక కార్యకలాపాలను ముమ్మరం చేశారు. జపాన్, ఆస్ట్రేలియా, భారత్ వంటి దేశాల పట్ల అనవరస దూకుడును ప్రదర్శిస్తున్నారు.
అమెరికాను కేవలం ప్రాంతీయ ఆర్థిక శక్తిగా చూపించే ప్రయత్నం చేసింది చైనా. రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అంటూ ప్రగల్బాలు పలికింది. సాయుధ దళాలను ఆధునికీకరిస్తోంది. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో నావికాదళ స్థావరాలను అభివృద్ధి చేస్తోంది. అభివృద్ధి చెందుతున్న దేశాలను అప్పుల వలలో చిక్కుకునేలా చేసేందుకు బెల్ట్ అండ్ రోడ్ ఇనీషియేటివ్(బీఆర్ఐ)ను ప్రారంభించింది. తన బలాన్ని ప్రదర్శించుకుంటూ.. అమెరికాతో వాణిజ్య చర్చల్లో మొండి వైఖరి అవలంబించింది.
చైనాను ఒంటరి చేసే వ్యూహం!
అటు అధ్యక్షుడు ట్రంప్ సైతం వెనక్కి తగ్గలేదు. ఈ వివాదాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడానికే మొగ్గుచూపారు.
"కచ్చితంగా ప్రపంచమంతటికీ చైనా ఓ పెనుముప్పు. అందరికంటే వేగంగా సైనిక శక్తిని పెంచుకుంటున్నారు. నిజానికి ఇదంతా అమెరికా డబ్బును ఉపయోగించి చేస్తున్నారు."