ఒక దేశం సుస్థిరంగా సుసంపన్నంగా అవతరించాలంటే నాణ్యమైన మానవ వనరులు, విలువలతో కూడిన విద్యార్థులు అవసరం. విద్యపై పెట్టుబడి- దీర్ఘకాలంలో వ్యూహాత్మక వృద్ధిని సాధించే ఆయుధం. నూతన జాతీయ విద్యావిధానం ద్వారా ఈ రంగంలో మార్పులు చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్న తరుణంలో మౌలిక సౌకర్యాల కల్పన, ప్రాథమిక విద్యపై ప్రభావం వంటి అంశాల్ని చర్చించాల్సిన అవసరం ఉంది.
సరైన పర్యవేక్షణ కరవు
భారత్లో విద్యపై జీడీపీలో 3.8 శాతంగా చేస్తున్న ఖర్చు- స్కాండినేవియన్ దేశాలతో పోలిస్తే చాలా తక్కువని పలు నివేదికలు చెబుతున్నాయి. క్షేత్ర స్థాయిలో మౌలిక సౌకర్యాలైన మూత్రశాలలు, ఆట స్థలాలు, క్రీడా పరికరాలు, పారిశుద్ధ్యం, ప్రథమ చికిత్స సామగ్రి, శుభ్రమైన తాగునీరు, వంట గదులు, మధ్యాహ్న భోజనంలో నాణ్యత, విద్యుత్తు సరఫరా, ప్రయోగశాలలు, గ్రంథాలయాలు వంటివి అందుబాటులో లేకపోవడం విద్యా నాణ్యతకు అవరోధాలుగా నిలుస్తున్నాయి. మౌలిక సౌకర్యాల కల్పన కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో పథకాలు అమలు చేస్తున్నా- సరైన పర్యవేక్షణ, నిర్వహణ కొరవడటంవల్ల ఆశించిన ఫలితాలు దక్కడం లేదు.
'విద్యాప్రమాణాలు అంతంతమాత్రమే'
'యునెస్కో' నివేదికల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 2030 సంవత్సరం నాటికి సుమారు 6.90 కోట్ల ఉపాధ్యాయుల అవసరం ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి. నాణ్యమైన విద్యాబోధకుల కొరత ప్రపంచంలోని ఎన్నో దేశాల్ని వేధిస్తున్న సమస్య. ప్రపంచ దేశాలతో పోలిస్తే భారత్లో విద్యార్థి, ఉపాధ్యాయ నిష్పత్తి 24:1గా ఉండటం ఆందోళన కలిగించే పరిణామం. కరోనాకు ముందు పూర్తి పని దినాలతో కొనసాగినప్పుడే పాఠశాలల్లో విద్యాప్రమాణాలు అంతంతమాత్రంగా ఉన్నాయని, విద్యార్థుల్లో కనీస సామర్థ్యాలు కొరవడ్డాయని పలు నివేదికల్లో వెల్లడైంది. 'ప్రథమ్' సంస్థ రూపొందించిన 'అసర్' నివేదిక ప్రకారం- అయిదో తరగతి విద్యార్థులు మూడు అంకెల కూడికలు, తీసివేతలు చేయలేకపోతున్నారు. ఆరో తరగతి విద్యార్థులు రెండో తరగతి పుస్తకాన్ని చదవలేకపోతున్నారు. ఎనిమిదో తరగతి విద్యార్థులు సైతం చిన్న పేరాలోని అంశాలను అర్థం చేసుకొని వివరించలేకపోతున్నారు. ఎనిమిదో తరగతి స్థాయి లెక్కలు చేయగలిగేవారు 2016లో 51.4శాతం ఉంటే, 2018లో 43శాతానికి పడిపోయినట్లు వెల్లడైంది. ఇదంతా విద్యా ప్రమాణాల క్షీణతకు నిదర్శనంగా నిలుస్తోంది. మూలిగే నక్కపై తాటిపండు పడినట్లుగా విద్యావ్యవస్థను కరోనా మహమ్మారి మరింత సంక్షోభంలోకి నెట్టింది. ఆన్లైన్ పాఠాలు వినేందుకు కనీస అవసరాలైన అంతర్జాలం, స్మార్ట్ ఫోన్ తదితర ఉపకరణాలు లేకపోవడమూ సమస్యగా మారింది. ముఖ్యంగా ప్రభుత్వ బడుల్లో చదువుతున్న విద్యార్థులకు ఇది పెద్ద సమస్యగా పరిణమించింది.