తెలంగాణ

telangana

ETV Bharat / opinion

ఆరోగ్య సంరక్షణే తొలి ప్రాథమ్యం.. ప్రోత్సాహమే పరమౌషధం - ఆసియా బయో సదస్సు 2021

గతేడాది అనూహ్యంగా విరుచుకుపడిన కరోనా మహమ్మారి.. భారీఎత్తున ప్రాణ, ఆర్థిక నష్టాన్ని కలిగించింది. ఈ నేపథ్యంలో ఆసియా సదస్సులో ఔషధ రంగం ఎదుర్కొంటున్న సవాళ్లు, అవకాశాల్ని లోతుగా చర్చించింది. ప్రపంచ జనరిక్​ ఔషధాల విపణిలో 20శాతం, వ్యాక్సిన్​లో 62శాతం వాటాతో మేటిగా రాణిస్తున్న భారత్​.. స్వస్థ భారత్‌ లక్ష్యాలతో పాటు ప్రపంచానికే ఔషధశాలగా ఉనికిని సుస్థిరం చేసుకొనే వ్యూహాత్మక పరివర్తనకు సిద్ధం కావాలి. ప్రపంచమే మొండి వ్యాధుల యుద్ధ క్షేత్రంగా మారుతున్న తరుణంలో ప్రాణాధార ఔషధ రంగం ఆరోగ్యకర ఎదుగుదలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరింతగా చొరవ చూపాలి!

Central and State Govts are need to take more initiative for the growth of Pharmaceutical sector
ప్రోత్సాహమే పరమౌషధం

By

Published : Feb 25, 2021, 7:59 AM IST

ధుమేహం, క్యాన్సర్‌ వంటి సాంక్రామికేతర దీర్ఘకాలిక వ్యాధుల కారణంగా వచ్చే పదేళ్లలో దేశాలన్నీ 30 లక్షల కోట్ల డాలర్ల భూరి నష్టాన్ని భరించాల్సి వస్తుందని ప్రపంచ ఆర్థిక వేదిక నివేదించింది. నిరుడు అనూహ్యంగా విరుచుకుపడిన కొవిడ్‌ మహమ్మారి ఎన్నో యుద్ధాల పెట్టుగా ప్రాణ నష్టాన్ని ఆర్థిక అరిష్టాన్ని కలిగించిన నేపథ్యంలో భాగ్యనగర వేదికపై జరిగిన బయో ఆసియా సదస్సు- మారిన వాతావరణంలో ఔషధ రంగం ఎదుర్కొంటున్న సవాళ్లు, అవకాశాల్ని లోతుగా చర్చించింది. వ్యక్తి స్థాయిలోను, ప్రభుత్వాలపరంగాను ఆరోగ్య సంరక్షణే తొలి ప్రాథమ్యంగా మారిన వేళ కొత్త పుంతలు తొక్కుతున్న సాంకేతికత దన్నుగా జీవ శాస్త్రాల్లోని విభాగాలన్నీ జూలు విదిలించాల్సిన తరుణమిది. ప్రపంచ జనరిక్‌ ఔషధాల విపణిలో 20శాతం, టీకాల్లో 62 శాతం వాటాతో మేటిగా రాణిస్తున్న ఇండియా- స్వస్థ భారత్‌ లక్ష్యాలతోపాటు ప్రపంచానికే ఔషధశాలగా ఉనికిని సుస్థిరం చేసుకొనే వ్యూహాత్మక పరివర్తనకు సిద్ధం కావాలి.

ప్రైవేటు రంగంలోనూ..

ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ (ఐఓటీ), కృత్రిమ మేధ, సెన్సర్ల వంటి అత్యధునాతన సాంకేతికత పురివిప్పి అందుబాటులోకి వస్తున్నందున ఆయా నమూనాల్ని సమన్వయీకరించుకొంటూ ఔషధ దిగ్గజాలు ముందడుగేయాల్సి ఉంటుంది. ఆ దిశగా పరిశోధన అభివృద్ధికి ప్రభుత్వాలు అండదండగా నిలవాల్సి ఉండగా- సంబంధిత వ్యయాలకు ఇచ్చే పన్ను ప్రోత్సాహకాల్లో కోతను బయో సదస్సు ప్రస్తావించింది. బయో లాజిక్స్‌లో చైనా, క్యాన్సర్‌ విభాగంలో అమెరికా పెద్దయెత్తున పరిశోధనలతో కొత్త మాలిక్యూల్స్‌ను ఆవిష్కరిస్తున్నాయంటూ, పరిశోధనలపై దేశీయంగా ప్రభుత్వ ఉదాసీనత మీద ఆవేదనా వ్యక్తమైంది. ఆరోగ్యరంగాన ఆత్మనిర్భరత కోసం నాలుగంచెల వ్యూహంతో ముందడుగేస్తున్నామన్న ప్రధాని మోదీ- ప్రతిబంధకాల్ని అధిగమిస్తూ లక్ష్యసాధన దిశగా స్థిరంగా సాగుతామని ప్రకటించారు. నేషనల్‌ రీసెర్చ్‌ ఫౌండేషన్‌కు ఇటీవలి బడ్జెట్లో అయిదేళ్ల కాలావధికి రూ.50వేల కోట్లు కేటాయించి, ఫార్మా రంగానికి రూ.15వేల కోట్లతో ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాలు ప్రకటించిన కేంద్రం- ప్రైవేటు రంగంలో పరిశోధనలకూ బాసటగా నిలవాలిప్పుడు!

మౌలిక సదుపాయాల్ని కల్పిస్తేనే..

దేశానికి అత్యవసరమనిపించే నాలుగైదు కీలకాంశాల్ని గుర్తించి ప్రైవేటు రంగం ముందుకొస్తే ఆయా ఔషధ, మెడ్‌టెక్‌ సంస్థలకు అవసరమైన సమస్త ప్రోత్సాహకాలు, నాణ్యమైన మౌలిక సదుపాయాల్ని ప్రభుత్వం కల్పిస్తుందని నీతి ఆయోగ్‌ సీఈఓ భరోసా ఇస్తున్నారు. పరిమిత వనరుల్ని తలా కొంచెం విదపడంవల్ల ప్రయోజనం లేదన్న మాట నిజమే అయినా- ప్రభుత్వ నిబంధనల్లో స్థిరత్వం, నియంత్రణ వ్యవస్థ విధివిధానాలూ సానుకూలంగా ఉండాల్సిన అవసరాన్ని పారిశ్రామికవేత్తలు ప్రస్తావిస్తున్నారు! 2019లో 6300 కోట్ల డాలర్లుగా ఉన్న భారత బయో టెక్నాలజీ పరిశ్రమ 2025నాటికి 10,200 కోట్ల డాలర్లకు చేరగలదన్న అంచనాలున్నాయి. అందులో బయో ఫార్మా 58 శాతం, బయో సేవల రంగం 15శాతం వాటాలతో దూసుకుపోతున్నాయి.

వైద్య ఉపకరణాల తయారీలో..

జెనరిక్‌ ఔషధాల విపణిలో ఇండియా మెరుగ్గానే రాణిస్తున్నా, ముడి ఔషధాల (ఏపీఐ) కోసం దిగుమతులే దిక్కయిన దుస్సహ స్థితి వెంటాడుతూనే ఉంది. అయిదారు రాష్ట్రాల్లో అరడజను దాకా బల్క్‌ డ్రగ్స్‌ ఉత్పాదక సముదాయాల్ని ఏర్పాటు చేయాలని, కాలుష్యరహితంగా క్లస్టర్ల అభివృద్ధి నిర్వహణలకు ప్రభుత్వాలు తోడ్పాటు అందించాలని డాక్టర్‌ వీఎం కాటోచ్‌ కమిటీ 2013లోనే సూచించింది. వైద్య ఉపకరణాల తయారీ పార్కుల ఏర్పాటుకు నేడు 16 రాష్ట్రాలు సిద్ధంగా ఉన్నాయన్న కేంద్రం- ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాలతో వాటికి బాసటగా నిలుస్తోంది. ప్రపంచ స్థాయి వైద్య పరికరాల కేంద్రాన్ని రూ.1200 కోట్లతో హైదరాబాద్‌లో ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించిన మెడ్‌ట్రానిక్‌- కార్యకలాపాల విస్తరణ ద్వారా ఇంజినీరింగ్‌ విద్యార్థులు సంస్థతో కలిసి పనిచేసే అవకాశాన్ని ప్రస్తావించింది. ప్రపంచమే మొండి వ్యాధుల యుద్ధ క్షేత్రంగా మారుతున్న తరుణంలో ప్రాణాధార ఔషధ రంగం ఆరోగ్యకర ఎదుగుదలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరింతగా చొరవ చూపాలి!

ఇదీ చదవండి:బాపూ.. చూస్తున్నావా నీ దేశాన్ని!

ABOUT THE AUTHOR

...view details