కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తోంది భాజపా నేతృత్వంలోని ఎన్డీఏ మిత్రపక్షం శిరోమణి అకాలిదళ్(ఎస్ఏడీ). ఈ సందర్భంగా ఎన్డీఏలో కొనసాగాలా వద్దా అనే అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు పార్టీ అధ్యక్షుడు సుఖ్బీర్ సింగ్. పార్టీతో చర్చించి త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.
పార్లమెంట్లో తమ పార్టీ అభిమతాన్ని వెల్లడించిన సుఖ్బీర్.. సమావేశాల అనంతరం విలేకరులతో మాట్లాడారు. రైతుల కోసం ఎలాంటి త్యాగానికైనా తమ పార్టీ సిద్ధమని వెల్లడించారు.
అంతకు ముందు వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ.. కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేశారు ఎస్ఏడీ నేత హర్సిమ్రత్ కౌర్ బాదల్. తన రాజీనామాను ప్రధానమంత్రి కార్యాలయానికి సమర్పించిన తర్వాత కీలక వ్యాఖ్యలు చేశారు హర్సిమ్రత్. రైతుల సమస్యలు పరిష్కరించకుండా వ్యవసాయ బిల్లులను తీసుకువచ్చిన ఈ ప్రభుత్వంలో భాగం కావాలనుకోవట్లేదని ఆమె పేర్కొన్నారు.
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ బిల్లుల్లో రెండింటికి గురువారం మూజువాణి ఓటు ద్వారా ఆమోదం తెలిపింది లోక్సభ. మరో బిల్లు మంగళవారమే దిగువ సభలో గట్టెక్కింది.
ఇదీ చూడండి: కేంద్రమంత్రి హర్సిమ్రత్ రాజీనామా.. కారణమిదే?