ధర్మేంద్ర ప్రతాప్ సింగ్... ఉత్తర్ప్రదేశ్ ప్రతాప్గఢ్ వాసి. వయస్సు 43. ఎత్తు 8 అడుగుల ఒక అంగుళం. దేశంలోనే అత్యంత ఎత్తయిన వ్యక్తిగా గుర్తింపు పొందారాయన.
ధర్మేంద్రకు ఇటీవలే ఓ శస్త్రచికిత్స జరిగింది. గుజరాత్ అహ్మదాబాద్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రి... ఆయనకు తుంటి మార్పిడి ఆపరేషన్ను ఆగస్టు 26న విజయవంతంగా చేసింది. ఆయన ఇప్పటికి దాదాపు పూర్తిగా కోలుకున్నారు.
కొంతకాలం క్రితం జరిగిన ఓ ప్రమాదంలో ధర్మేంద్ర తుంటి దెబ్బతింది. తర్వాత ఆయన తీవ్రమైన నడుము నొప్పితో బాధపడ్డారు. చికిత్స చేయలేమని లఖ్నవూలోని వైద్యులు చేతులెత్తేశారు. ఫలితంగా ధర్మేంద్ర అహ్మదాబాద్ చేరుకున్నారు. ఆయన ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఉచితంగా వైద్యం చేసింది కేడీ ఆస్పత్రి.