RTC Bus Brakes Fail: ఆర్టీసీ బస్సులో ఉన్న ప్రయాణికులకు పెను ప్రమాదం తప్పింది. ఒక్కసారిగా బ్రేకులు విఫలమయ్యాయి. దీనికి తోడు స్టీరింగ్ సైతం పట్టేసింది. ఇవన్నీ చూస్తుంటే.. ఆర్టీసీ బస్సుల పరిస్థితిపై పలు అనుమానాలను రేకెత్తించే విధంగా ఉంది. డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో ప్రయాణకికులంతా ప్రాణాలతో బయటపడ్డారు. లేదంటే.. ఘోర ప్రమాదం జరిగేది. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు ఘాట్ రోడ్డులో ఆర్టీసీ బస్సుకు ఘోర ప్రమాదం తప్పింది. పాడేరు డిపో నుంచి 40 మంది ప్రయాణికులతో చోడవరం వెళుతున్న ఆర్టీసీ బస్సు.. రాజపురం ఘాట్ రోడ్ వద్దకు రాగానే బ్రేకులు విఫలమయ్యాయి. స్టీరింగ్ కూడా పట్టేయడంతో డ్రైవర్ చాకచక్యంగా కొండగట్టును ఢీకొట్టాడు. దీంతో బస్సు నిలిచిపోవడంతో పెను ప్రమాదం తప్పింది. వెంటనే ప్రయాణికులంతా దిగి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కోసం చూస్తున్నారు. కొండను ఢీకొట్టలేనట్లయితే పక్కనే ఉన్న 60 అడుగుల లోయలోకి బస్సు దూసుకుపోయి తీవ్ర ప్రాణహాని జరిగేదని ప్రయాణికులు తెలిపారు. ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో.. అందరూ సురక్షితంగా కిందకి దిగిపోవడంతో.. ప్రయాణికులంతా ఊపిరి పీల్చుకున్నారు.