Fishing on Road: రాష్ట్రంలో రోడ్ల దుస్థితి.. గుంతల్లో చేపలు పట్టిన విద్యార్థులు
Fishing on Road: రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి దారుణంగా తయారైంది. ఎక్కడ చూసినా గుంతలే కనిపిస్తున్నాయి. కొన్నిచోట్ల పెద్ద పెద్ద గుంతలతో రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. ఎన్టీఆర్ జిల్లాలో పెనుగంచిప్రోలు నుంచి జగ్గయ్యపేటకు వెళ్లే ప్రధాన రహదారిపై ఉన్న గుంతల్లో విద్యార్థులు చేపలు పట్టారు. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా ఎగువ పొలాల నుంచి వరదనీరు రోడ్డుపైకి వచ్చి చేరాయి. రహదారిపై ఉన్న గుంతల్లో చేపలు చేరటంతో స్థానిక ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు, గ్రామస్థులు వాటిని పట్టుకున్నారు. ఈ దృశ్యాలను చూసి రోడ్డుపై రాకపోకలు చేస్తున్న వారు విచిత్రంగా చూస్తున్నారు. ఈ దృశ్యాలు చూసిన ప్రజలు వైసీపీ పాలనపై విమర్శలు గుప్పిస్తున్నారు. రహదారులు దెబ్బతిని తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. వైసీపీ పాలనలో రోడ్లు మరమ్మతులకు నోచుకోవడం లేదని ఆరోపించారు. అధికారులు పట్టించుకోకుండా నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారన్నారు. కనీసం ఇప్పటికైనా అధికారులు దృష్టి సారించి రోడ్ల మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు.