Erra Matti Dibbalu: ఎర్రమట్టి దిబ్బల చెంత ప్రకృతి విధ్వంసం.. భారీ చెట్లను వేళ్లతో సహా పెకిలించిన వైనం
Erra Matti Dibbalu: విశాఖలో ఇప్పటికే భారీ ఎత్తున పర్యావరణ విధ్వంసాన్ని చేసిన రాష్ట్ర ప్రభుత్వం.. ఇప్పుడు దానికి కొనసాగింపు చర్యలకు దిగుతోంది. ఈసారి ప్రపంచ ప్రసిద్ధమైన, భౌగోలిక వారసత్వ ప్రదేశంగా గుర్తించిన ఎర్రమట్టి దిబ్బలపై.. ప్రభుత్వం కన్నుపడింది. ఎర్రమట్టి దిబ్బలకు ఆనుకుని ఉన్న భూముల్లోనే అభివృద్ధి పనుల కోసం భూసమీకరణను చేపట్టింది. విశాఖ జిల్లాలో అభివృద్ధి పనుల నిమిత్తం చేపట్టిన భూసమీకరణకు భీమిలి మండలం నేరెళ్లవలస వద్ద సర్వే నంబరు 94, 95, 96, 97, 98, 99, 100లో 31.55 ఎకరాలు గుర్తించారు. రెవెన్యూ రికార్డు ప్రకారం అవి ఇసుక భూములు. వీటికి ఆనుకొనే ఎర్రమట్టి దిబ్బలు విస్తరించాయి. అక్కడ జరిగే కార్యకలాపాల వల్ల కలిగే నష్టం చెప్పే ధైర్యం ఎవరూ చేయలేదు. ఎర్రమట్టి దిబ్బలకు ఒకవైపు సముద్రం, మరోవైపు ఐఎన్ఎస్ కళింగ, ఇంకోవైపు హౌసింగ్ సొసైటీ స్థలాలు ఉన్నాయి. పశ్చిమం వైపే తోటలున్నాయి. అక్కడే రక్షణ చర్యలు చేపట్టాల్సి ఉన్నా... విధ్వంసం ఆ ప్రాంతంలోనే జరుగుతోంది. ఇందుకోసం భారీ సంఖ్యలో చెట్లు తొలగించి భూమిని చదును చేస్తున్నారు. జీడిమామిడి, మామిడి, తాటిచెట్లను వేళ్లతో సహా పెకలించి వేశారు. పచ్చదానాన్ని నామరూపాల్లేకుండా చేశారు. తొలగించిన చెట్లను అక్కడే కాల్చేశారు. దీంతో ఈ ప్రాంతం ఎడారిని తలపిస్తోంది. విధ్వంసంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్న పర్యావరణ వేత్తలు.. భవిష్యత్తులో నగరానికి పెనుముప్పు తప్పదని హెచ్చరిస్తున్నారు. విశాఖలో ప్రస్తుత విధ్వంసంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కూర్మరాజు ఎర్రమట్టి దిబ్బల నుంచి అందిస్తారు.