తన తండ్రి వైఎస్ వివేకా హత్యకేసులో ఎన్నో అనుమానాలున్నాయని హైకోర్ట్లో ఆయన కుమార్తె సునీత, అల్లుడు రాజశేఖర్రెడ్డి ఇటీవల దాఖలు చేసిన వ్యాజ్యంలో ప్రస్తావించారు. హత్య గురించి తనకు తెలియదని కాపలాదారు రంగన్న అంటున్నారని వ్యాజ్యంలో పేర్కొన్నారు. హత్య జరిగిన రోజు రాత్రి అరుపులేమైనా విన్నారా... అనే విషయాన్ని రంగన్న వెల్లడించలేదని వివరించారు. వివేకా తల, శరీరంపై లోతైన గాయాలను చూస్తే..... ఒకరి కంటే ఎక్కువ మందే...గాయపరిచి ఉంటారనే అనుమానం వ్యక్తం చేశారు.
రంగన్న ఎలా లోపలికి వెళ్లారు?
కుడిచేతి మీద ఉన్న గాయాన్ని చూస్తే తనపై జరిగే దాడిని అడ్డుకునేందుకు వివేకా యత్నించినట్లు కనిపిస్తోందన్నారు. కాపలాదారు రంగన్న బయట ఉన్నప్పుడు నేరస్థులు ఇంట్లోకి ఎలా వెళ్లగలిగారని వ్యాజ్యంలో ప్రస్తావించారు. రంగన్నకు తెలియకుండా పక్క ద్వారం నుంచి ఎలా తప్పించుకోగలరని.. రంగన్న ఇంటిని చూసుకోకుండా రాత్రి ఎలా నిద్రపోయారనే అనుమానం వ్యక్తం చేశారు. పక్క తలుపులోంచి రంగన్న ఎలా లోపలికి వెళ్లారనే అంశాన్ని వాజ్యంలో లేవనెత్తారు. ఆ తలుపు తెరిచి ఉందని ఆయనకు ఎలా తెలుసు... ఈ చర్యలన్నీ రంగన్న వ్యవహారశైలిని తెలియజేస్తున్నాయని వ్యాజ్యంలో పేర్కొన్నారు.
ఎందుకు అలా ప్రచారం చేశారు?
ఘటనా స్థలిలో పులివెందుల సీఐ సహా అనేకమంది ఉండగా...సాక్ష్యాలు తుడిపేశారన్న అభియోగంపై ముగ్గురి మీదే ఎందుకు కేసుపెట్టారని.. సునీత వ్యాజ్యంలో ప్రశ్నించారు. వివేకా మృతదేహంపై ఉన్న గాయాలకు సంబంధించి షేక్ ఇనయతుల్లా తీసిన ఫోటోలు, వీడియోలు మా దృష్టికి వచ్చే వరకూ గుండెపోటుతో మృతి చెందారని ఎందుకు ప్రచారం చేశారో అర్థం కాలేదన్నారు. పడక, స్నానపు గదిలో రక్తపు మరకలు వివేకా తలపై గాయాలు కనిపించినప్పుడు గుండెపోటుతో మృతి చెందారని టీవీ ఛానళ్లలో ఎలా ప్రసారమైందనే అనుమానం వ్యక్తం చేశారు. ఘటన జరిగిన రోజు ఉదయం ఎనిమిదిన్నర- తొమ్మిదిన్నర మధ్య ఎఫ్ఐఆర్ నమోదైందని వ్యాజ్యంలో పేర్కొన్న సునీత దంపతులు.. అంతకు ముందే ఘటనాస్థలిని సందర్శించిన సీఐ.. అక్కడ రక్తపు మరకలు వివేకా తలమీద గాయాలు చూశారన్నారు. అలాంటప్పుడు తొలుత అనుమానాస్పద మృతి కింద కేసు ఎలా నమోదు చేశారని వ్యాజ్యంలో ప్రశ్నించారు. ఈ సెక్షన్ కింద కేసు నమోదు వెనక ఉన్నది ఎవరు, కేసు నమోదు చెయ్యొద్దని ఎర్ర గంగిరెడ్డి ఎందుకు ఒత్తిడి చేశారని వ్యాజ్యంలో పేర్కొన్నారు.