కరోనా మహమ్మారి నుంచి బయటపడాలంటే ప్రతి ఒక్కరూ భౌతిక దూరం పాటించాలని ఉపముఖ్యమంత్రి, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అంజాద్ బాషా పేర్కొన్నారు. కడప జిల్లాలోని మాసాపేట, బిస్మిల్లా నగర్లో నిరుపేదలకు ఆయన కూరగాయలు పంపిణీ చేశారు. మాసాపేటలో 1500 కుటుంబాలకు, బిస్మిల్లా నగర్లో 700 కుటుంబాలకు వీటిని అందజేశారు. ఈ సందర్భంగా మాసాపేటలో డ్వాక్రా మహిళలు ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కరోనా వైరస్ను దృష్టిలో ఉంచుకొని ముస్లింలు పవిత్ర రంజాన్ మాసంలో ఇళ్లలోనే ప్రార్థనలు చేసుకోవాలని అంజాద్ బాషా సూచించారు. ప్రతి మసీదుకు ఐదుగురు మాత్రమే వెళ్లి ప్రార్థనలు చేసుకోవాలని చెప్పారు. ముస్లింలందరూ కరోనాను దృష్టిలో ఉంచుకొని తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కడప నగరపాలక సంస్థ పరిధిలో ప్రజారోగ్య కార్మికులు, సిబ్బందికి జాయింట్ కలెక్టర్ గౌతమి నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు.