స్టైరీన్ లీకేజీ ఘటన జరిగి వారం రోజులు పూర్తైనా పరిసర గ్రామాల ప్రజలను ప్రమాద భయం వీడటం లేదు. ఇప్పటికీ పూర్తిస్థాయిలో ప్రజలు ఇళ్లకు తిరిగి చేరుకోలేదు. కొంత మంది గ్రామాలకు చేరుకున్నా ఇళ్లను శుభ్రం చేసుకుని పునరావాస కేంద్రాలకు, బంధువుల ఇళ్లకు వెళ్లిపోతున్నారు. ప్రజల్లో భయం పోగొట్టేందుకు అటు జీవీఎంసీ అధికారులు, ఎల్జీ పరిశ్రమ సిబ్బంది కృషి చేస్తున్నారు. జీవీఎంసీ అధికారులు పరిశ్రమ పరిసర గ్రామాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టి నివాసయోగ్యంగా మార్చేందుకు శ్రమిస్తున్నారు.
విషవాయు ప్రభావం వల్ల ఎండిపోయిన చెట్లను తొలగించారు. బ్లీచింగ్ పౌడర్ చల్లారు. సోడియం ద్రావణాన్ని పిచికారీ చేశారు. ట్యాంకర్ల ద్వారా ప్రజలకు తాగునీరు సరఫరా చేశారు. గ్రామస్తులకు ఫినాయిల్, లైజాల్ ఉచితంగా అందజేశారు. మరికొన్ని రోజుల పాటు గ్రామాల్లో సహాయక చర్యలు కొనసాగుతాయని అధికారులు తెలిపారు. ఎల్జీ పాలిమర్స్ సంస్థ కూడా స్థానికులకు భోజన వసతి కల్పించడంతో పాటు గ్రామాల్లో పారిశుద్ధ్య చర్యలు చేపట్టింది. మరోవైపు ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమ నుంచి స్టైరీన్ను పూర్తిగా తరలించినట్లు పరిశ్రమల శాఖ ప్రత్యేక కార్యదర్శి కరికాల వలవన్ వెల్లడించారు.
విశాఖ ఎల్జీ పాలిమర్స్ బాధిత గ్రామాల్లో భారతీయ జనతా యువ మోర్ఛా బృందం పర్యటించింది. ప్రభుత్వం ప్రకటించిన సాయాన్ని బాధితులకు వెంటనే అందించాలని బీజేవైఎం నేతలు డిమాండ్ చేశారు. నిత్యావసర వస్తువులు అందించి ఆదుకోవాలని కోరారు. బాధిత గ్రామాల్లో ప్రభుత్వ సహాయ చర్యల పట్ల తెలుగుదేశం నేత చింతకాయల అయ్యన్నపాత్రుడు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఒకటి రెండ్రోజుల్లో బాధిత గ్రామాల్లోకి వెళ్లి తీరతామన్నారు.