విశాఖ ఎంవీపీ కాలనీలోని మానసిక, దివ్యాంగ వికలాంగుల ఆశ్రమం హిడెన్ స్ప్రౌట్లోని కట్టడాలను జీవీఎంసీ అధికారులు కూల్చి వేశారు. 2012లో అప్పటి ప్రభుత్వం ఈ సంస్థకు భూమిని లీజుకిచ్చింది. గడువు ముగిసినందున మహానగర పాలక సంస్థ అధికారులు కట్టడాలను కూల్చి వేశారు. లీజు రెన్యువల్ చేసుకునేందుకు ప్రయత్నిస్తుండగానే.. ముందస్తు సమాచారం ఇవ్వకుండా నోటీసులు ఇచ్చి కట్టడాలను పడగొట్టారని నిర్వహకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నో ఏళ్లుగా మానసిక, దివ్యాంగ వికలాంగ విద్యార్థులకు అండగా నిలుస్తున్న ఆశ్రమాన్ని కూల్చి వేయడం అమానవీయమని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారుల దుందుడుకు చర్యలతో 50 మంది విద్యార్థులు రోడ్డున పడ్డారని నిర్వాహకులు, తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
దివ్యాంగుల ఆశ్రమంలోని కట్టడాల కూల్చివేతపై ఆందోళన
విశాఖ ఎంవీపీ కాలనీలో మానసిక, దివ్యాంగ, వికలాంగుల ఆశ్రమంలోని కట్టడాల కూల్చివేతపై ఆందోళన వ్యక్తమవుతోంది. లీజు గడువు ముగిసిందంటూ శనివారం పాఠశాలకు జీవీఎంసీ అధికారులు తాళం వేసి సీజ్ చేశారు. దీనిపై విద్యార్థుల తల్లితండ్రులు, నిర్వహకులు మండిపడ్డారు. స్కూల్ ఎదుటే బైఠాయించి నిరసన తెలిపారు.
జీవీఎంసీ అధికారుల చర్యలపై జనసేన నేతలు మండిపడ్డారు. మానవత్వంతో వ్యవహరించకుండా ప్రవర్తించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అంశంపై పోరాటం చేస్తామని హెచ్చరించారు. స్కూల్ ఎదుట నిరసనకు దిగిన విద్యార్థుల తల్లితండ్రులు, హిడెన్ స్ప్రౌట్ యాజమాన్యంతో పోలీసులు చర్చించారు. కొవిడ్ సమయంలో పిల్లలతో కలిసి ఆందోళన చేయడం సరికాదన్నారు. జీవీఎంసీ అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరించుకోవాలంటూ.. నిరసన శిబిరం నుంచి వారిని పంపి వేశారు.
ఇదీచదవండి: anandayya medicine: సర్వేపల్లి వాసులకు ఆనందయ్య మందు పంపిణీ