విశాఖ సాగర తీరంలో నౌకాదళ దినోత్సవ వేడుకలు ప్రజలను మంత్రముగ్ధుల్ని చేశాయి. నావికా దళం సభ్యులు నేలపై, నీటిలోనూ, గగనతలంలో ప్రదర్శించిన విన్యాసాలు ఒళ్లు గగుర్పొడిచాయి. 6 వేల అడుగుల ఎత్తులో పయనిస్తున్న విమానం నుంచి భూమిపైకి దూకిన స్కై డైవర్ల సాహసం అందరినీ ఆశ్చర్యపరిచింది. ప్రధాన వేదిక వద్ద దిగిన ఓ స్కై డైవర్ ముఖ్య అతిథిగా హాజరైన సీఎం జగన్కు స్మృతి చిహ్నం అందించారు. యుద్ధ విమానాలు, నౌకల ప్రదర్శన, అత్యవసర సహాయక చర్యలు, ఆపరేషన్లను నౌకాదళం ప్రదర్శించింది. సముద్రంలో బంకర్ పేలుడు, సారస్, చేతక్ హెలికాప్టర్లు, డోర్నియర్, హాక్స్ విమానాల మెరుపు విన్యాసాలు అలరించాయి.
ఆలోచన రేకెత్తించిన" క్లీన్ వైజాగ్ సందేశం"
నౌకాదళం విన్యాసాల్లో భాగంగా ఇచ్చిన క్లీన్ వైజాగ్ సందేశం ఆకట్టుకొంది. ప్లాస్టిక్ దుష్పరిణామాలను కళ్లకు కడుతూ విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించారు.
ఆకట్టుకున్న దృశ్యాలు
విన్యాసాల్లో పాల్గొన్న నౌకాదళ సిబ్బందికి ఓ చిన్నారి మిఠాయిలు పంచిన దృశ్యాలు ఆకట్టుకున్నాయి. శక్తివంతమైన ఆయుధ సంపత్తి, సైన్యం సాహసాలు స్ఫూర్తి నింపాయని ప్రజలు పేర్కొన్నారు. ఏ దేశ సేవలో నావికాదళం పాత్రను వివరిస్తూ ప్రదర్శించిన లఘు చిత్రాన్ని ముఖ్య అతిథిగా హాజరైన సీఎం జగన్ వీక్షించారు. నౌకాదళంలో కొత్తగా చేర్చుకున్న యుద్ధ నౌకలు, జలాంతర్గాములు, పోరాట విమానాల పనితీరును ఇందులో పొందుపర్చారు. తూర్పు నౌకా దళాధిపతి వైస్ అడ్మిరల్ అతుల్ కుమార్ జైన్ సీఎంకు ఆయా అంశాలను స్వయంగా వివరించారు.