అక్టోబరులో ప్రత్యేక డిప్యూటీ కలెక్టరు సురేంద్రను నియమించిన ప్రభుత్వం భూముల పరిస్థితిపై 15 రోజుల్లో నివేదిక తెప్పించుకుంది. అయినా పరిస్థితి మారలేదు. అధికారుల పర్యవేక్షణ లోపంతో అక్రమ నిర్మాణాల జోరు మళ్లీ మొదలైంది. కీలక పోస్టులు ఇన్ఛార్జ్లతో నడవడం, ఆక్రమణలను గుర్తించే గార్డులు తగినంతగా లేకపోవడం, ఏఈవోల పర్యవేక్షణ అంతంతమాత్రంగానే ఉండడంతో ఎక్కడ ఏం జరుగుతుందో తెలియడంలేదు. కొందరికి తెలిసినా చూసీచూడనట్లు వదిలేస్తున్నారు.
అక్రమ నిర్మాణాలను ప్రోత్సహించడంలో కొందరు ఉద్యోగుల పాత్ర ఉన్నట్లు గుర్తించి వారిపై చర్యలకు ఆదేశించారు.
పంచగ్రామాల్లో.. ఇష్టానుసారంగా: పంచగ్రామల్లో దేవస్థానం మంజూరు చేసిన భూమి క్రమబద్ధీకరణ పత్రం (ఎల్ఆర్సీ) ఉన్న స్థల యజమానులు మాత్రమే జీవీఎంసీ అనుమతి తీసుకుని భవనాలు నిర్మించాలి. కానీ, కొందరు తమకు నచ్చినట్లు నిర్మాణాలు సాగిస్తున్నారు. దేవస్థానం, జీవీఎంసీకి చెందిన కొందరు సిబ్బంది నిర్మాణదారుల నుంచి కొంత డబ్బు తీసుకొని నిర్మాణాలు ప్రోత్సహిస్తున్నారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.
వసూళ్లు ఇలా...
దేవస్థానం సిబ్బంది కొందరు మధ్యవర్తులను నియమించుకొని వారి ద్వారా పంచగ్రామాల్లో అక్రమ నిర్మాణాలు చేపట్టిన వారి నుంచి వసూళ్లు చేపట్టి నిర్మాణాలు ప్రోత్సహిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. భవన నిర్మాణ పనులు కూడా వారు చెప్పిన గుత్తేదారులకే అప్పగించేలా ఒప్పందాలు సైతం జరుగుతున్నట్లు సమాచారం. గతంలో కన్నా ఇప్పుడు అధిక సంఖ్యలో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.
పంచగ్రామాల్లో కొందరు ఇళ్లు నిర్మించి వాటిని ప్రైవేటు వ్యక్తులకు సైతం అమ్మేస్తున్నారు. ప్రస్తుతం 98వ వార్డు గణేశ్కాలనీ, శ్రీనివాసనగర్, 93వవార్డు శంకర్ఫౌండేషన్ ఆసుపత్రి వెనుక సాయిదుర్గానగర్ , 94వవార్డు ఆర్ఆర్ వెంకటాపురం, నాయుడుతోట, రవినగర్, గౌతంనగర్, వేపగుంట, వరలక్ష్మీనగర్, పురుషోత్తపురాల్లో నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి. గోపాలపట్నం, ఆరిలోవ, హనుమంతవాక కొండవాలు ప్రాంతల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. కైలాసపురం, ఆరిలోవ పంచగ్రామాల్లో కొన్నిచోట్ల పలువురు ఇళ్లు నిర్మించి వాటిని దర్జాగా విక్రయిస్తున్నారు.
ఇది గణేశ్కాలనీలోని ప్రాతం... అనుమతి ఉందని చేపట్టిన నిర్మాణంపై ఫిర్యాదు రావడంతో దేవస్థానం సిబ్బంది అడ్డుకున్నారు.