ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Dec 6, 2020, 10:11 AM IST

ETV Bharat / state

ఇసుక కష్టాలు తీరేదేన్నడు..!

సరఫరాలో పారదర్శకత, ఎప్పుడు కోరుకుంటే అప్పుడు ఇంటి ముంగిటకే అందిస్తామని... ప్రభుత్వం చెప్పిన మాటలన్నీ నీటి మూటలుగానే మిగిలిపోతున్నాయి. ఇసుక ఇప్పుడు బ్రహ్మ పదార్థంగా మారిపోయింది. గత ప్రభుత్వం అమలు చేసిన విధానంలో మార్పులు తీసుకొచ్చినా... వినియోగదారుడికి అందనంత దూరంలోనే ఉంటుంది. మరోపక్క పెరిగిన ధరలతోనూ అవస్థలు తప్పలేదు.

sand shortage
ఇసుక కష్టాలు తీరేదేన్నడు

గ్రామ సచివాలయం, ఏపీఎండీసీల పర్యవేక్షణలో ఆన్‌లైన్‌లో ఇసుక బుకింగ్‌ ప్రక్రియను అప్పజెప్పింది ప్రభుత్వం. ఎవరికైనా కావాలంటే వార్డు, గ్రామ సచివాలయాలకు వెళ్లి ముందుగా బుక్‌ చేసుకోవాలి. యూనిట్‌ ఇసుక 375 రూపాయాలు చెల్లించాలి. రేవు నుంచి స్టాక్‌యార్టు, అక్కడి నుంచి కోరుకున్న చోటుకయ్యే ఖర్చు అదనం. బుక్‌ చేసే సమయానికి ఏ నిల్వ కేంద్రంలో అందుబాటులో ఉంటుందో అక్కడి నుంచి బుక్‌ అవుతోంది. ఒకవేళ కేంద్రం దూరంగా ఉంటే రవాణా ఖర్చులు కూడా పెరుగుతాయి. అయినా కూడా శ్రీకాకుళం జిల్లాలో ప్రస్తుతం ఇసుక దొరకని పరిస్థితి నెలకొంది.

తడిసి మోపెడు..

నిజానికి ఇసుక ధర కంటే అదనపు ఖర్చులే వినియోగదారుడికి అధికం అవుతున్నాయి. కొన్నిచోట్ల అదనపు ఖర్చు రెండింతలవుతోంది. ఇటీవల ఇళ్లు, ఇతర నిర్మాణాలు, ప్రభుత్వ భవనాలు, ఉపాధి పనుల కట్టడాలు ఒకసారి ఊపందుకోవడంతో కొన్నిచోట్ల ఇసుక కొరత ఏర్పడింది. వినియోగదారులకు దగ్గరలో ఉన్న స్టాక్‌యార్డులో లేకుంటే వేరేచోట నుంచి ఇస్తున్నారు. ఫలి తంగా ధరలు ఒక్కసారిగా పెరిగిపోతున్నాయి. దీనికితోడు కొత్త ఛార్జీలు మరింత భారంగా పరిణమిస్తున్నాయి. అయినా సరఫరాలో తీవ్ర జాప్యం చోటు చేసుకోవడంతో భవన నిర్మాణదారులు అవస్థలు పడుతున్నారు.

అదనంగా రూ.2 వేలు చెల్లిస్తేనే...

ఇసుక కోసం ప్రక్రియ అంతా పూర్తిచేయడం కష్టమనుకుంటే అది ఇంటికి ఎప్పుడొస్తుందో చెప్పడం మరీ కష్టం. బుకింగ్‌ సమయంలో రవాణా కోసం ప్రభుత్వం నిర్దేశించిన ధరకు తాము సరఫరా చేయలేమని కొందరు లారీ డ్రైవర్లు చెబుతున్నారు. దానికి అదనంగా రూ.2 వేలు చెల్లిస్తేనే డెలివరీ చేస్తామని తెగేసి చెప్పేస్తున్నారు. ఆ ప్రకారం చెల్లించిన వారికి అనుకున్న దానికంటే ముందే ఇంటికొచ్చేస్తోంది. ఇవ్వని వారికి మాత్రం జాప్యం చేస్తూ చుక్కలు చూపిస్తున్నారు.

అవగాహన లేమి, సాంకేతిక సమస్యలు..

నూతన ఇసుక విధానంలో కొన్ని సాంకేతిక సమస్యలు ఉత్పన్నమవుతూనే ఉన్నాయి. స్వయంగా ఆన్‌లైన్‌లో ఇంటి నుంచి ఇసుక బుక్‌ చేసుకోవాలంటే అన్ని సందర్భాల్లోనూ కుదరడం లేదు. సాంకేతికత గురించి తెలియని వారు పడే ఇబ్బందులు వేరే చెప్పనక్కరలేదు. తప్పక గ్రామ, వార్డు సచివాలయాలకు వెళ్లాల్సి వస్తోంది. ఇప్పటికీ కొన్ని సచివాలయాల్లో సిబ్బంది తమకు అవగాహన లేదని తిప్పి పంపించడం గమనార్హం. మరి కొందరు సాంకేతిక సమస్యల సాకుతో రోజుల తరబడి తిప్పించుకుంటున్నారు. కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా ఇసుక దొరకక సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారు. మరో గత్యంతరం లేక బ్లాక్‌ మార్కెట్లో కొనుగోలు చేయాల్సి వస్తోందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

18 రోజులుగా ఎదురుచూపులు..: ఈ చిత్రంలోని వ్యక్తి పేరు చిక్కాల శ్రీకాంత్‌. స్వగ్రామం సంతబొమ్మాళి మండలం నౌపడ. నవంబరు 13న స్థానిక గ్రామ సచివాలయంలో 18 టన్నుల(లారీ) ఇసుక కోసం నమోదు చేసుకున్నారు. ప్రభుత్వం నిర్దేశించిన రుసుం రూ.12,793 చెల్లించి రశీదు పొందారు. నాలుగురోజుల్లో ఇసుక ఇంటికొస్తుందని అధికారులు తెలిపారు. 19 రోజులు దాటినా ఇప్పటికీ రాలేదు. సకాలంలో అందక ఇంటి నిర్మాణం అర్ధంతరంగా ఆగిపోయింది. సచివాలయ సిబ్బందిని సంప్రదించగా టోల్‌ఫ్రీ నంబర్‌ 14500కు కాల్‌ చేయాలని ఉచిత సలహా ఇచ్చారు. పోనీ దానికి ఎన్నిసార్లు చేసినా స్పందన లేదు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా సమస్యకు పరిష్కారం దక్కలేదు.

*టెక్కలి ప్రాంతానికి శేఖర్‌ కొద్దిరోజుల కిందట రూ.13 వేలు చెల్లించి 18 టన్నుల ఇసుక లోడు కొనుగోలు చేశారు. నిర్మాణ అవసరాల దృష్ట్యా మరో లోడు అవసరమైంది. మళ్లీ గ్రామ సచివాలయానికి వెళ్లిన అతను అవాక్కయ్యారు. ఇప్పుడు అదే లారీ (18 టన్నులు) ఇసుకకు రూ.22,333 చెల్లించాలనడంతో ఆందోళనకు గురయ్యారు. రెండు, మూడు వారాల వ్యవధిలో ధర పెరుగుదల చూసి ఆశ్యర్యపోవడం అతని వంతైంది.

జాప్యం మాట వాస్తవమే..

కొన్నిచోట్ల ఇసుక సరఫరాలో జాప్యం జరుగుతున్న మాట వాస్తవమే. కొద్ది నెలల విరామం తర్వాత ఒక్కసారిగా నిర్మాణాలు ఊపందుకోవడంతో డిమాండ్‌ పెరిగింది. ప్రసుత్తం 11 వేల టన్నుల ఇసుక వినియోగదారులకు ఇవ్వాల్సి ఉంది. దీనిలో మెజారిటీ శాతం నిర్ణీత గడువులోపు ఇవ్వాల్సిందే ఉంది. వీలైనంత మేరకు రేవుల నుంచి ఇసుకను స్టాక్‌యార్డులకు అక్కడి నుంచి వినియోగదారులకు చేరుస్తున్నాం. ఇబ్బందులను పరిష్కరిస్తున్నాం. కావాలని ఆలస్యం చేస్తున్న గుత్తేదారులను గుర్తించి జరిమానాలు విధిస్తాం. మారకుంటే తొలగించేందుకూ వెనుకాడబోం.

-సుమిత్‌ కుమార్‌, సంయుక్త కలెక్టరు (ఆర్‌అండ్‌ఆర్‌బీ)

ఇదీ చదవండీ...

నకిలీ మందులొస్తున్నాయా? 'ఫార్మర్ కనెక్ట్'​ యాప్ ఇన్​స్టాల్ చేయండి!

ABOUT THE AUTHOR

...view details