రైతులను మోసం చేసిన వ్యాపారిపై ప్రకాశం జిల్లా ఎస్పీ సిద్దార్ద్ కౌశల్ దృష్టి సారించి... వ్యాపారి నుంచి సొమ్మును రికవరీ చేశారు. పర్చూరు మండలం నూతలపాడుకు చెందిన నరేంద్ర అనే వ్యక్తి గతంలో వ్యాపారులు రైతుల వద్ద కొనుగోలు చేసిన మిర్చీని వాహనంలో గుంటూరుకు చేర్చేవాడు. తానే ఈ వ్యాపారం ఎందుకు చేయకూడదని భావించి మూడేళ్లుగా గ్రామాల్లోని రైతుల నుంచి మిరప కొనుగోళ్లు సాగిస్తున్నాడు.
నమ్మకం కలిగించి మోసం చేశాడు
మొదట్లో రైతులకు సకాలంలో డబ్బులు చెల్లించి నమ్మకం కలిగించాడు. ఈ ఏడాది కొనుగోలుచేసిన సరుకు తాలూకు డబ్బులు ఇవ్వకపోవటంతో రైతులు అందోళనకు గురయ్యారు. కొంతకాలం అతను చరవాణికి కూడా అందుబాటులో లేకపోవటంతో... అన్నదాతలు పర్చూరు పోలీసులను ఆశ్రయించగా, వారు కేసు నమోదు చేశారు.
లోతుగా విచారణ
విచారణ చేపట్టిన పోలీసులు.. దాదాపు 55 మంది రైతులకు రూ.70 లక్షల వరకు ఇవ్వాల్సి ఉందని గుర్తించారు. దీంతో పోలీసులు నరేంద్రను అదుపులోకి తీసుకుని విచారించగా తనవద్ద డబ్బులేదని , రైతుల నుంచి కొనుగోలు చేసిన ధరకన్నా తక్కువకు విక్రయించటంవల్ల నష్టం వచ్చిందని పోలీసులకు తెలిపాడు. విషయం తెలుసుకున్న జిల్లా ఎస్పీ సిద్దార్ద్ కౌశల్ రైతులకు న్యాయం చేయాలనే ఉద్దేశ్యంతో స్దానిక పోలీసులకు దిశా నిర్దేశం చేయటంతో...మరింత లోతుగా విచారణ చేపట్టి పూర్తి వివరాలు సేకరించారు.
ఎస్పీకి రైతుల కృతజ్ఞతలు
గుంటూరులో వ్యాపారికి రావాల్సిన కమీషన్, రూ.28 లక్షలు రికవరీ చేయించారు. 55 మంది రైతులు మొదట్లో ఫిర్యాదు చేసినా వీరిలో కొంతమందికి చెల్లించినట్లు విచారణలో వెల్లడైంది. మొత్తం రూ.44లక్షలు చెల్లించాలని పోలీసులు తేల్చారు. 32 మందికి... వ్యాపారి డబ్బులు చెల్లించలేదని , ప్రస్తుతం రికవరీ అయిన సొమ్ము వారికి ఇవ్వాలని పోలీసులు సూచించారు. మిర్చి అమ్మకాల మొత్తంలో తమకు 60 శాతమైనా తిరిగి వచ్చేలా చేసిన ఎస్పీ సిద్దార్ద్ కౌశల్కు బాధిత రైతులు కృతజ్జతలు తెలిపారు. సామాజిక బలం ఉంటే ఎలాంటి సమస్యనైనా పరిష్కరించవచ్చని, దానికి ఉదాహరణ నూతలపాడు రైతులేనని ఎస్పీ అన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ సిద్దార్థ్ కౌశల్ను రైతులు సత్కరించారు.
ఇదీ చదవండి:
అమరావతికి ఐదేళ్లు... ఐకాస ప్రత్యేక కార్యాచరణ