అమ్మో.. ఆ రహదారిపై ప్రయాణమా..?
ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం మీదుగా వెళ్లే జాతీయ రహదారిపై నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి. రోడ్డు పనులను చేపట్టిన నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా(ఎన్హెచ్ఏఐ) అధికారులు... సరైన నిర్వహణ పనులు చేయకపోవటంతో ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం మీదుగా వెళ్లే.. జాతీయ రహదారి నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. నిత్యం రద్దీగా ఉండే ఈ రోడ్డుపై చాలా చోట్ల మలుపులు ఉన్నాయి. బోయిన్పల్లి, గురిజేపల్లి వద్ద నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇటీవల జరిగిన ప్రమాదంలో బోయన్పల్లి వద్ద ఉన్న రక్షణ కంచే ధ్వంసమైంది. దీన్ని ఇప్పటివరకు బాగు చేయలేదు. ఎల్ ఆకారంలో ఉన్న మలుపు వద్ద ముళ్లచెట్లు పెరిగి పోవడంతో... ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించే పరిస్థితి లేదు. వేగంగా వచ్చే వాహనాలు ఏమాత్రం అదుపుతప్పినా అంతే సంగతులు. గురిజేపల్లి ఎస్సీ కాలనీకి ఆనుకుని ఈ రోడ్డు ఉంది. కాలనీలోని చిన్నారులకు ఎప్పుడు ఏం జరుగుతుందోనని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. కనీస రక్షణ చర్యలు చేపట్టకుండా వదిలేశారని వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.