ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Sep 26, 2020, 7:39 PM IST

ETV Bharat / state

డ్రాగన్ సాగుకు రైతుల ఆసక్తి... తోడుగా ప్రభుత్వం రాయితీ

'డ్రాగన్' అనగానే మంటలు కక్కే జంతువు ఠక్కున గుర్తుకు వస్తుంది. అదే డ్రాగన్ ఫ్రూట్ గుర్తుకు వస్తే నోరూరుతుంది. రాత్రి వేళల్లో పువ్వులు విచ్చుకోవడం ఈ పండు ప్రత్యేకత. తెలుపు, ఎరుపు రంగుల్లో వినియోగదారులను ఆకర్షించడమే కాదు. పోషక విలువలూ ఉన్నాయంటున్నారు నిపుణులు. ఇప్పటికే చాలా రాష్ట్రాల రైతులు డ్రాగన్ ఫ్రూట్ సేద్యంలో ముందుండగా.. రాష్ట్ర కర్షకులు ఇప్పుడు అటుగా దృష్టి పెట్టారు.

డ్రాగన్ పంట
డ్రాగన్ పంట

డ్రాగన్ పంట సాగు

విదేశాల నుంచి మాత్రమే గతంలో దిగుమతయ్యే డ్రాగన్ ఫ్రూట్.. దేశీయంగానూ లభిస్తోంది. మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు రాష్ట్రాల్లో విస్తారంగా పండిస్తున్నారు. అధిక పెట్టుబడి కారణంగా ఏపీలో రైతులు కొంత వెనకడుగు వేస్తున్నారు. ప్రభుత్వం ప్రోత్సహిస్తే తామూ సాగుచేస్తామని నెల్లూరు కర్షకులు ముందుకొస్తున్నారు.

భలే గిరాకీ...

నెల్లూరు రూరల్ మండలం మట్టెంపాడుకు చెందిన భాస్కర్ రావు.. కుమార్తె నిశ్చితార్థంలో డ్రాగన్ ఫ్రూట్​ చూశారు. చాలా ముచ్చట పడి ఐదు మొక్కలతో ఈ సాగు ప్రారంభించారు భాస్కర్​రావు. అలా మొదలైన డ్రాగన్​ ఫ్రూట్ సాగు.. ​రెండున్నర ఎకరాలకు విస్తరించింది.

ప్రస్తుతం వినియోగదారులు పొలం వద్దకే వచ్చి కొంటున్నారు. కోతకు వచ్చిన పంటను కిలో రూ. 200 చొప్పున విక్రయిస్తున్నారు. మార్కెటింగ్​ ఇబ్బంది లేదని చెబుతున్నారు భాస్కర్​రావు.

పెట్టుబడి భారం

డ్రాగన్ ఫ్రూట్ సాగుకు ఎకరాకు 4 నుంచి 5 లక్షల రూపాయల పెట్టుబడి అవసరమవుతుందని భాస్కర్ రావు తెలిపారు. ఈ ఖర్చుకు తగిన ఫలితం కూడా ఉంటుందని చెబుతున్నాడీ రైతు. పంట వేసిన మూడేళ్ల నుంచి దిగుబడి వస్తుందని... నాలుగో ఏడాదికి దాదాపు రూ. 10 లక్షలు సంపాదించవచ్చని వివరించారు. ప్రభుత్వం మరింత చేయూతనిస్తే భారీ స్థాయిలో ఈ పంట వైపు మొగ్గుచుపే అవకాశముందని అభిప్రాయపడ్డారు.

పోషక విలువలు

శరీరానికి అవసరమైన పోషకవిలువలు ఈ పండు తింటే లభిస్తాయని, రోగ నిరోధక శక్తి పెరుగుతుందని చెబుతున్నారు ఉద్యాన శాఖ ఏడీ ప్రదీప్ కుమార్.

ప్రభుత్వ ప్రోత్సాహం

నెల్లూరు జిల్లాలో ఇప్పుడిప్పుడే రైతులు డ్రాగన్ పంట వైపు మళ్లుతున్నారని స్థానిక ఉద్యాన శాఖ సహాయ సంచాలకుడు ప్రదీప్ కుమార్ తెలిపారు. భారీ పెట్టుబడి అవసరమైనందున ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం అందించడానికి ప్రణాళికలు రచించామని పేర్కొన్నారు. అధికారులు సానుకూలంగా స్పందించి హెక్టారుకు రూ. 3.30 లక్షలు రాయితీ ఇవ్వడానికి నిర్ణయించారని వివరించారు. ఔత్సాహిక రైతులు తమను సంప్రదించాలని కోరారు.

ఇదీ చదవండి:

పేరు నమోదు కోసం రైతు భరోసా కేంద్రంలో సంప్రదించాలి : నరసోజిరావు

ABOUT THE AUTHOR

...view details