STU Leaders Reaction on Orders of the Higher Authorities: పదో తరగతి పరీక్షల్లో గత ఏడాది నంద్యాల జిల్లాలో జరిగిన మాల్ప్రాక్టీస్ వ్యవహారంలో కొంతమంది ఉపాధ్యాయులపై విద్యాశాఖ చర్యలు తీసుకుంది. ఈ ఏడాది పదో తరగతి పరీక్షల నిర్వహణ క్రమంలో వారిని పోలీసు స్టేషన్లో ఉంచాలని అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. దీనిపై ఉపాధ్యాయ సంఘ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలం అంకిరెడ్డిపల్లెలోని పదో తరగతి సమయంలో.. పరీక్షా కేంద్రంలో గత ఏడాది మాల్ ప్రాక్టీస్ జరిగింది. ఈ వ్యహారంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా పాత్ర ఉన్న ఉపాధ్యాయులు, ఉద్యోగులపై అధికారులు చర్యలు తీసుకున్నారు. తాజాగా ఈసారి కూడా ఉపాధ్యాయులను పోలీసు స్టేషన్లో ఉంచాలని విద్యాశాఖ అధికారులు నిర్ణయించారు.
ఉపాధ్యాయులపై కక్ష సాధింపు చర్యల్లో భాగంగా అధికారులు ఇలాంటి చర్యలు తీసుకోవడం సరికాదని రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం (ఎస్టీయూ) నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పదో తరగతి పరీక్ష సమయాల్లో కొందరు ఉపాధ్యాయులను పోలీస్ స్టేషన్లో ఉంచాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేయడం చాలా దారుణమని ఎస్టీయూ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఆజం బేగ్, మౌలాలి ఖండించారు. స్థానిక ఎస్టీయూ కార్యాలయంలో శనివారం నిర్వహించిన మీటింగ్లో వారు మాట్లాడారు.
ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుల సంఘం రాష్ట్ర సహాయ అధ్యక్షుడు చంద్రశేఖర్, ఉపాధ్యాక్షుడు గోపాలకృష్ణ, మాజీ ఉపాధ్యక్షుడు సుబ్బరాయుడు, కార్యాలయం ఇన్ఛార్జి సుబ్బయ్య, నంద్యాల మండల అధ్యక్షుడు శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఉపాధ్యాయులను అవమానపరిచే ఈ ఉత్తర్వులను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు.