కర్నూలు జిల్లా ప్యాపిలి మండలంలో అవినీతి నిరోధక శాఖ తనిఖీలతో అధికారుల్లో గుబులు పట్టుకుంది. సోమవారం ఎంపీడీవో కార్యాలయంలో అనిశా డీఎస్పీ శివనారాయణస్వామి ఆధ్వర్యంలో సీఐలు తేజేశ్వరరావు, కృష్ణారెడ్డి, వంశీనాథ్, సీతారామిరెడ్డి తదిరులు తనిఖీలు చేపట్టారు. ప్యాపిలి మండలం మెట్టుపల్లె గ్రామానికి చెందిన సుబ్బన్న కుమారుడు చంద్రుడు ఫిర్యాదు మేరకు అధికారులు ఈ చర్యకు ఉపక్రమించారు.
మెట్టుపల్లెకు చెందిన సుబ్బన్న తన పొలంలో పట్టు పరిశ్రమ షెడ్డు ఏర్పాటు చేసుకునేందుకు పట్టు పరిశ్రమ శాఖ, ఉపాధి హామీ అధికారులకు దరఖాస్తు చేసుకున్నారు. 2019లో పట్టు పరిశ్రమ శాఖ నుంచి షెడ్డు ఏర్పాటుకు రూ.8.50 లక్షలు మంజూరయ్యాయి. ఇందులో పట్టు పరిశ్రమ శాఖ అధికారులు రూ.3 లక్షలు మంజూరు చేసినట్లు తెలిపారు. రూ.5.50 లక్షలు ఎన్ఆర్ఈజీఎస్ కింద రావాల్సి ఉందన్నారు. వాటిలో 2020 అక్టోబరులో రూ.3.15లక్షలు మంజూరయ్యాయన్నారు.