సంక్రాంతికి నెల ముందే ప్రయాణ కష్టాలు మొదలయ్యాయి. బస్సులు, రైళ్లలో రిజర్వేషన్లు పూర్తయిపోయాయి. ముఖ్యంగా ఆంధ్ర వైపు వెళ్లే బస్సుల్లో బుకింగ్ తెరిచిన ఒకట్రెండు గంటల్లోనే సీట్లన్నీ నిండిపోయాయి. జనవరి 13 వరకూ రిజర్వేషన్లు పూర్తయిపోవడం వల్ల సొంతూరు వెళ్లేందుకు ప్రయాణికులు తంటాలు పడుతున్నారు.
10-13 నాలుగు రోజుల రద్దీ
రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహా నగరంలో... తెలంగాణ జిల్లాలతో పాటు ఆంధ్రప్రదేశ్కు చెందిన వారు లక్షలాది మంది ఉన్నారు. పండక్కి ఊరెళ్లేవారిలో ముందుగానే ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మిగిలిన వాళ్లు 11, 12 తేదీల్లో.. హైదరాబాద్కు దగ్గరలోని తెలంగాణ జిల్లాల ప్రయాణికులు.. ఏపీలో ప్రకాశం, నెల్లూరు, రాయలసీమ జిల్లాలకు చెందిన కొందరు 12, 13 తేదీల్లో ప్రయాణ ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
వెయిటింగ్లిస్ట్
- హైదరాబాద్ నుంచి ఏపీ వైపు ఏపీఎస్ఆర్టీసీ సగటున రోజుకు 600 బస్సులు నడుపుతోంది. దాదాపు అవన్నీ నిండిపోయాయి.
- విజయవాడకు వెళ్లే కొన్ని సర్వీసులు, పగటి సమయంలో నడిచే మరికొన్ని ఇతర ప్రాంత సర్వీసుల్లోనే స్పల్పంగా సీట్లున్నాయి.
- ఏపీ వైపు టీఎస్ఆర్టీసీ నిత్యం 300 వరకు బస్సులు నడుపుతోంది. వీటన్నింటిలోనూ సీట్లు నిండిపోయాయి.
- విశాఖపట్నం, కాకినాడ, రాజమహేంద్రవరం, అమలాపురం, భీమవరం, ఏలూరు, ఖమ్మం, భద్రాచలం వైపు బస్సుల్లో వెయిటింగ్లిస్ట్ పరిమితి దాటిపోయింది.
భారీగా ఛార్జీలు పెంపు
పండగ రద్దీ స్పష్టంగా కన్పిస్తున్నా ద.మ.రైల్వే ఇప్పటివరకు సంక్రాంతి ప్రత్యేక రైళ్లు ప్రకటించకుండా జాప్యం చేస్తోందని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైళ్లలో అవకాశం లేకపోవడంతో ప్రైవేటు బస్సుల ఆపరేటర్లు భారీగా ఛార్జీలు పెంచేస్తున్నారు. రిజర్వేషన్ ఇక్కట్లు లేని జనసాధారణ్ రైళ్లను ముఖ్యంగా తెలంగాణ జిల్లాలకు పెద్దసంఖ్యలో నడపాలని ప్రయాణికులు కోరుతున్నారు.