కృష్ణా జిల్లాలో న్యూడెవలప్మెంట్ బ్యాంకు (ఎన్డీబీ) నిధులతో నిర్మాణం చేయనున్న రాష్ట్ర ప్రధాన రహదారుల విస్తరణ, పటిష్ఠం ప్యాకేజీ టెండర్లను వృద్ధి కన్స్ట్రక్షన్స్, రిత్విక్ సంస్థల సంయుక్త భాగస్వామ్యానికి (జేవీ) దక్కించుకున్నాయి. టెండర్లను దాఖలు చేసిన సంస్థలలో వృద్ధి-రిత్విక్ భాగస్వామ్య సంస్థ ఎల్1గా నిలిచినట్లు తెలిసింది. ఎన్డీబీ టెండర్లకు సోమవారం రివర్స్ టెండర్లను నిర్వహించారు. దీనిలో వృద్ధి, రిత్విక్ జేవీ సంస్థ మాత్రమే తక్కువకు కోట్ చేసినట్లు తెలిసింది.
కృష్ణాజిల్లాలో మొత్తం 13 రాష్ట్ర రహదారులు విస్తరణ, పటిష్ఠత కోసం రూ.233.96 కోట్లతో టెండర్లను పిలిచిన విషయం తెలిసిందే. మొత్తం 48.93 కిలోమీటర్ల విస్తరణ, పటిష్ఠతతో పాటు 11 వంతెనలను ఈ ప్యాకేజీ కింద చేర్చారు. దీనికి మొత్తం రూ.398.04 కోట్లు అంచనా వ్యయం. ఈ నిధుల్లో 70 శాతం ఎన్డీబీ, 30 శాతం రాష్ట్ర ప్రభుత్వం భరించనుంది. దీనిలో భూసేకరణ మినహాయించి రూ.233.96 కోట్లకు టెండర్లను పిలిచారు. మొదటి ధఫా టెండర్లను పిలిచినప్పుడు రెండే దాఖలయ్యాయి. దీంతో రద్దు చేశారు. మొదటి దఫాలో వృద్ధి సంస్థతో పాటు కేఎన్ఆర్ సంస్థ దాఖలు చేసింది. రెండోసారి పిలిచినప్పుడు ఈ రెండింటితో పాటు ఎన్సీసీ సంస్థ దాఖలు చేసింది. సాంకేతిక బిడ్ల పరిశీలనలో ఎన్సీసీ సంస్థ అర్హత సాధించలేదు. మొదటి దఫా వేసిన రెండు సంస్థలే బరిలో మిగిలాయి. ఈ రెండింటికి రివర్స్ టెండర్లకు అవకాశం కలిగింది. అంటే తాము దాఖలు చేసిన ధరలను ఎంత తగ్గించుకుంటారో వెల్లడించాల్సి ఉంటుంది. ఈ అవకాశాన్ని వృద్ధి-రిత్విక్ సంయుక్త భాగస్వామ్య సంస్థ మాత్రమే ఉపయోగించుకున్నట్లు తెలిసింది.