కృష్ణా జిల్లా నందిగామలో ప్లాస్టిక్ వ్యర్థాలు, చెత్తా చెదారం తిన్న గోవు.. రక్తపు విరోచనాలతో మృతి చెందిన ఘటన స్థానికుల హృదయాలను కలిచి వేసింది. పంచాయతీ కార్మికులు ఎనిమిది రోజులుగా సమ్మె చేయడం వల్ల కుండీల్లో చెత్త పేరుకుపోయింది. వీటిని తిని తీవ్ర అనారోగ్యానికి గురై ఆవు ఇబ్బంది పడింది. దానిని కాపాడేందుకు హిందూ ధర్మ రక్షణ సమితి రాష్ట్ర కార్యదరి వందేమాతరం అశోక్, ఆ సంఘం ప్రతినిధి శీను.. స్థానిక పశు వైద్యులను సంప్రదించారు.
స్థానిక గోపాలమిత్ర శంకర్, విశ్రాంత పశు వైద్యులు ఆత్కూరి ఆంజనేయులు గోవును పరీక్షించి.. రక్త విరోచనాలు అవుతున్నాయని, ఎక్కువ సేపు బతుకదని చెప్పారు. విషాహారం వల్ల అనారోగ్యానికి గురైన ఆవుకు చివరి ప్రయత్నంగా చికిత్స అందిస్తుండగానే ప్రాణాలు వదిలింది. ఆ గోమాత మరణరోదన అందరినీ కంట తడి పెట్టించింది. స్థానిక జానకిరామయ్య కాలనీలోని ముత్యాలమ్మ దేవాలయానికి.. దాతలు ఈ గోవును దానంగా ఇచ్చారని హిందూ ధర్మ రక్షణ సమితి ప్రతినిధులు తెలిపారు.