కరోనాపై పోరుకు తెదేపా నేతల విరాళం
కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు చేపట్టిన చర్యల కోసం తెదేపా నేతలు ముందుకొచ్చారు. గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ తన ఎంపీ నిధుల నుంచి రూ.2.50 కోట్లు ప్రకటించారు. అలాగే గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో 50 లీటర్ల శానిటైజర్, 3వేల ఎన్95 మాస్కులు అందజేయనున్నట్లు ఆయన ఓ ప్రకటనలో తెలిపారు.
కరోనా నియంత్రణ చర్యల కోసం తెదేపా నేతలు తమ వంతుగా ముందుకు వచ్చారు. గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ తన ఎంపీ నిధుల నుంచి రూ.2.50 కోట్లు ప్రకటించారు. ఈ మేరకు గుంటూరు కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ కుమార్కు ఆయన లేఖ రాశారు. గుంటూరులోని ప్రభుత్వాసుపత్రుల్లో కరోనా వార్డుల్లో వెంటిలేటర్ల కొనుగోలు... రోగులకు చికిత్స అందించేందుకు అవసరమైన ఉపకరణాలు, వైద్యులకు కావాల్సిన సామాగ్రిని కొనుగోలు చేసేందుకు ఆ మొత్తం ఉపయోగించాలని కోరారు. అలాగే గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో 50 లీటర్ల శానిటైజర్, 3వేల ఎన్95 మాస్కులు అందజేయనున్నట్లు ఓ ప్రకటనలో తెలిపారు. ఎంపీ నిధులకు సంబంధించిన లేఖను పార్టీ నేతల ద్వారా కలెక్టర్కు పంపించారు. సంఘం డెయిరీ ఛైర్మన్ ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ ముఖ్యమంత్రి సహాయనిధికి రూ. 50 లక్షలు విరాళం ప్రకటించారు. బోర్డు డైరెక్టర్ల సమావేశంలో ఈ మేరకు నిర్ణయించినట్లు ఆయన ఓ ప్రకటనలో తెలిపారు. కరోనా నివారణ చర్యల కోసం ఈ మొత్తాన్ని వినియోగించుకోవాలని కోరారు. భయంకరమైన ఈ వ్యాధి ఎక్కువ మందికి సోకకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలన్నారు. సామాజిక బాధ్యతగా తమ వంతుగా ఈ విరాళం ముఖ్యమంత్రి సహాయనిధికి త్వరలో అందజేయనున్నట్లు తెలిపారు.