BJP leaders arrests: రైతుల సమస్యలపై భాజపా కిసాన్ మోర్చా 'చలో గుంటూరు'కు పిలుపునివ్వడంతో.. పోలీసులు ఆ పార్టీ నేతలను ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. అన్ని జిల్లాల నుంచి భాజపా, కిసాన్మోర్చా నాయకులు గుంటూరు వెళ్లకుండా.. ముందస్తుగానే గృహ నిర్భందం చేస్తున్నారు. గుంటూరు, కృష్ణా, ఉభయగోదావరి, ప్రకాశం తదితర జిల్లాల్లో కిసాన్ మోర్చా నాయకులను.. మంగళవారం రాత్రి నుంచే అరెస్టు చేశారు. వైకాపా ప్రభుత్వ హయాంలో రైతుల పరిస్థితి దయనీయంగా మారిందని.. కిసాన్ మోర్చా నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు.
వైకాపా ప్రభుత్వ హయాంలో రైతుల పరిస్థితి చాలా దయనీయంగా మారిందని.. రైతుల సమస్య ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితికి తీసుకుని వచ్చారని కిసాన్మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు శశిభూషణ్ రెడ్డి ఆరోపించారు. రైతుల గోడును ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చేందుకే మహాధర్నాకు పిలుపునిచ్చామని అన్నారు. మిరప రైతుల సమస్యలు, ధాన్యం కొనుగోలు, వ్యవసాయ పనిముట్లు సబ్సిడీపై సరఫరా.. తదితర అంశాల్లో నిద్రావస్థ నుంచి ప్రభుత్వాన్ని మేల్కొలుపుతామని హెచ్చరించారు. పోలీసులు అరెస్టులు చేస్తున్నా.. తాము శాంతియుతంగా తమ ఆందోళన కొనసాగిస్తామని శశిభూషణరెడ్డి పేర్కొన్నారు.