బాలోత్సవ్-2019 కార్యక్రమానికి గుంటూరు జిల్లా నంబూరులోని వీవీఐటీ ఇంజినీరింగ్ కళాశాల మరోసారి వేదికైంది. వేలాదిమంది విద్యార్థుల ఆటపాటలు, కేరింతలతో కళాశాల ప్రాంగణం సందడిగా మారింది. సాంస్కృతిక కార్యక్రమాలతో మార్మోగింది. పిల్లల్లో అంతర్గత నైపుణ్యాలను వెలికితీసేలా 1991లో ఖమ్మం జిల్లా కొత్తగూడెంలో వాసిరెడ్డి రమేశ్ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. నవ్యాంధ్రప్రదేశ్లో గుంటూరు శివారు వీవీఐటీ కళాశాలలో ఈ పోటీలు ఏటా జరుగుతున్నాయి. ఏపీ ఎన్నార్టీ ఛైర్మన్ వెంకట్.. బాలోత్సవ్ 2019 పోటీలు ప్రారంభించగా.. బాలోత్సవ్ వ్యవస్థాపకుడు వాసిరెడ్డి రమేష్, వీవీఐటీ ఛైర్మన్ వాసిరెడ్డి విద్యాసాగర్ కార్యక్రమంలో పాల్గొన్నారు. 20 అంశాల్లో 54 విభాగాల్లో విద్యార్థులు పోటీపడ్డారు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి 12వేల మంది విద్యార్థులు ఈ వేడుకకు తరలివచ్చారు. వారితో పాటు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు రాకతో బాలోత్సవ్ 2019 కార్యక్రమానికి వేదికైన వీవీఐటీ ప్రాంగణం కిటకిటలాడుతోంది. చదువు, మార్కుల ఒత్తిడితో సతమతమవుతున్న విద్యార్థులు సేదతీరేందుకు ఇదో మంచి అవకాశమని కార్యక్రమానికి హాజరైన వారు అభిప్రాయపడ్డారు.
ప్రతిభ కనబరిచేందుకు ఓ అవకాశం
ఎప్పుడూ పుస్తకాలతో కుస్తీపట్టే పిల్లలు స్వేచ్ఛగా తమకు నచ్చినరంగాల్లో ప్రతిభను చూపేందుకు పోటీపడ్డారు. చిత్రలేఖనంతో కొందరు చిత్తరువులు రూపొందించగా.. సినీ, జానపద, లలిత గీతాలు పాడి మరికొందరు అలరించారు. తెలుగు పద్యాల పఠనం, కవితా రచన, కథా రచన పోటీల్లో పాల్గొన్న విద్యార్థిని, విద్యార్థులు మాతృభాష పరిరక్షణకు తాము సైతం అంటూ ముందుకు వచ్చారు. శాస్త్రీయ సంగీతం, కూచిపూడి, భరత నాట్యం అంశాల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. సంప్రదాయ, విచిత్ర వేషధారణలతో మురిపించారు. ఏకపాత్రాభినయాలతో ఆకట్టుకున్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులు ఒకరి అభిప్రాయాలను మరొకరు తెలుసుకునే అవకాశం కల్గిందని చెబుతున్నారు.