ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ఏపీలో మూడేళ్లలో 4.95 లక్షల వృక్షాల నరికివేత

By

Published : Mar 2, 2020, 7:57 AM IST

రాష్ట్రంలో పచ్చని చెట్లపై గొడ్డలి వేటు పడుతోంది. పర్యావరణ సమతుల్యాన్ని కాపాడే వృక్షాలను అధిక సంఖ్యలో నేలకూలుస్తున్నారు. విద్యుత్తు లైన్లు, రహదారులు, గనుల తవ్వకాలు, సాగునీటి ప్రాజెక్టుల కోసం వీటిని బలి చేస్తున్నారు.

4.95 lakh trees cut in three years in AP
4.95 lakh trees cut in three years in AP

అభివృద్ధి కార్యక్రమాలు, ప్రాజెక్టుల పేరిట వృక్షాలపై వేటు పడుతోంది. అధికారికంగా, అనుమతులతోనే ఏటా లక్షన్నరకు పైగా చెట్లు నేలకొరుగుతున్నాయి. ఇలా గత మూడేళ్లలో ఆంధ్రప్రదేశ్‌లో 4,95,269 చెట్లను నరికేశారు. విద్యుత్తు లైన్లు, రహదారులు, గనుల తవ్వకాలు, సాగునీటి ప్రాజెక్టుల కోసం ఇవి బలైపోయాయి. ఇంత పెద్దస్థాయిలో తరువుల నరికివేతకు అనుమతిచ్చిన ప్రభుత్వాలు.. వాటి స్థానంలో మొక్కలు నాటడం, పచ్చదనం పెంపుపై శ్రద్ధ చూపట్లేదు.

  1. ఏపీలోనే 6.45 శాతం
  • 2016-19 మధ్య దేశవ్యాప్తంగా 76,72,337 చెట్ల నరికివేతకు అనుమతి లభించగా.. అందులో ఏపీలోనే 6.45% ఉన్నాయి. అత్యధికంగా చెట్లు నరికేసిన రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌ ఆరోస్థానంలో ఉంది. అనుమతులు లేకుండా నరికేసినవి ఇంకా చాలా ఉన్నాయి.
  • అటవీ భూమిని ఇతర అవసరాలకు వినియోగించాలంటే రాష్ట్రస్థాయిలో నోడల్‌ అధికారికి ప్రాజెక్టు ప్రతిపాదనలు పంపించాలి. పరిశీలన అనంతరం అటవీ సంరక్షణ చట్టం ప్రకారం అనుమతి ఇస్తారు.

గత మూడేళ్లలో ఈ రాష్ట్రాల్లోనే అత్యధికంగా చెట్లు నరికివేతకు గురయ్యాయి(ఆధారం: కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వశాఖ గణాంకాలు)

రాష్ట్రం నరికివేతకు గురైన చెట్లు
తెలంగాణ 12,12,753
మహారాష్ట్ర 10,73,484
మధ్యప్రదేశ్ 9,54,767
ఛత్తీస్​గఢ్ 6,65,132
ఒడిశా 6,58,465
ఆంధ్రప్రదేశ్ 4,95,269

ప్రత్యామ్నాయాలపై దృష్టి సారిస్తే..

మొక్కలు వృక్షాలుగా ఎదగాలంటే దశాబ్దాల కాలం పడుతుంది. వాటిని నరికేయడానికి బదులు మరోచోటకు తరలించి నాటితే (ట్రీ ట్రాన్స్‌ప్లాంటేషన్‌) కొంత ప్రయోజనం ఉంటుందనేది నిపుణుల మాట. దీనికి ఖర్చు ఎక్కువని.. అధికారులు ఆ దిశగా దృష్టి సారించట్లేదు. నరికేస్తున్న వాటిలో భారీ వృక్షాలు ఉంటున్నాయి. వాటికి ప్రత్యామ్నాయంగా అలాంటి మొక్కలను నాటలేకపోతున్నారు. ఒకవేళ నాటినా.. అవి పెరిగి పెద్దయ్యేలా చూసే చర్యలు కొరవడుతున్నాయి.

నిధులిలా!

జాతీయ అటవీ పెంపకం పథకం, గ్రీన్‌ ఇండియా మిషన్‌ కింద 2016-19 మధ్య ఆంధ్రప్రదేశ్‌కు గత మూడేళ్లలో రూ.15.25 కోట్లు విడుదలయ్యాయి. గతేడాది ఆగస్టులో రూ.1,734.81 కోట్ల కంపా నిధులు విడుదలయ్యాయి. వీటిని పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలి. అటవీ సంరక్షణ చట్టం ప్రకారం నరికివేతకు అనుమతిచ్చినవాటికి మించి మొక్కలు నాటాలి. గణాంకాల్లో అలా మొక్కలు నాటుతున్నట్లు చూపిస్తున్నా.. వాటిలో ఎన్ని పెరిగి పెద్దయ్యాయనేది చూస్తే డొల్లే. కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రిత్వశాఖ గణాంకాల ప్రకారం 2015-19 మధ్య రాష్ట్రంలో 46,03,188 మొక్కలు నాటారు. వీటిలో పెరిగినవి అంతంతమాత్రమే.

ఇదీ చదవండి

ప్రధాని మోదీ అంటే సీఎం జగన్​కు భయం: అసదుద్దీన్

ABOUT THE AUTHOR

...view details